త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ.. చిత్రాల్లో కథానాయికగా నటించారు సమంత. ఈ మూడూ బ్లాక్బస్టర్సే. అయితే.. ‘అఆ’ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో సమంత నటించలేదు. తాజా సమాచారం ప్రకారం మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రానున్నదని తెలుస్తున్నది. ఇటీవల ఓ సందర్భంలో సమంత తెలుగు సినిమాల్లో నటించాలని త్రివిక్రమ్ కోరారు. సామ్ కూడా తన ‘శుభం’ ప్రమోషన్లో భాగంగా తెలుగు సినిమాల్లో నటించాలనుందనీ, అయితే.. సరైన కథలు రావడం లేదని, మంచి లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ వస్తే చేస్తానని చెప్పుకొచ్చింది.
అందుకే.. సామ్ కోసం గురూజీ మళ్లీ కలం పట్టారట. ప్రస్తుతం ఆయన వెంకటేశ్తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. వెంకటేష్ కాల్షీట్లు ఖరారైతే.. ఈ సినిమా పట్టాలెక్కుతుంది. అయితే.. ఈ లోపు సామ్ కోసం గురూజీ ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ను తయారు చేసే పనిలో ఉన్నారట. 600కోట్ల నిర్మాణ వ్యయంతో అట్లీ తెరకెక్కిస్తున్న బన్నీ ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఈ గ్యాప్లో.. వెంకీ సినిమాతోపాటు సమంత సినిమాను కూడా పూర్తి చేసేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారని ఫిల్మ్ వర్గాల సమాచారం.