ఇరవై ఏళ్లకు పైనే కెరీర్. నేటికీ చెదరని స్టార్ స్టేటస్ వెరసి త్రిష కృష్ణన్. గత ఏడాది మూడు సినిమాల్లో కథానాయికగా నటించింది త్రిష. మూడూ ప్రెస్టేజియస్ పాజెక్టులే. ఈ ఏడాది అయిదు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. వాటిలో చిరంజీవి ‘విశ్వంభర’ ఒకటి. ఇంత లాంగ్విటీ ఉన్న హీరోయిన్లు అరుదుగా మాత్రమే ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీటన్నింటినీ మించి త్రిష మంచి నటి. అంతటి ప్రతిభావంతురాలు కాబట్టే నేటికీ కథానాయికగా ఆదరింపబడుతున్నారమె. అలాంటి నటిని గౌరవించాల్సింది పోయి, నోటికొచ్చినట్టు తూలనాడాడు తమిళనాడు ఏఐఏడీఎంకే నాయకుడు ఏవీ రాజు.
త్రిష వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ వార్తలు, వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా విపరీతంగా వైరల్ అయ్యాయి. రాజు వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర విమర్శలు కూడా వెల్లువెత్తాయి. త్రిషకు చిత్ర పరిశ్రమ నుంచి కూడా మద్దతు లభించింది. ఈ పరిణామంపై ఇప్పటికే స్పందించిన త్రిష.. రీసెంట్గా ఏవీ రాజుపై న్యాయపోరాటానికి దిగింది. అతనిపై పరువునష్టం దావా వేసింది. ట్విటర్ వేదికగా కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేసింది. మరి ఈ గొడవ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.