అదృష్టం అంటే త్రిషదే అంటున్నారు చెన్నై సినీ జనాలు. కొన్నేళ్ల క్రితం వరుస ఫ్లాపులతో ఈ భామ కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. అయితే ‘పొన్నియన్ సెల్వన్’ విజయం ఆమెకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతం తమిళంలో ఈ అమ్మడు వరుసగా భారీ చిత్రాల్ని అంగీకరిస్తూ బిజీగా ఉంది. విజయ్ సరసన ‘లియో’తో పాటు కమల్హాసన్ 234వ చిత్రంలో కూడా త్రిష కథానాయికగా నటిస్తున్నది. ఇటీవలే గౌరవ్ నారాయణన్ దర్శకత్వంలో ఓ మహిళా ప్రధాన చిత్రానికి అంగీకరించింది.
తాజా సమాచారం ప్రకారం ధనుష్ సరసన త్రిష ఓ చిత్రంలో నటించబోతున్నట్లు తెలిసింది. స్వీయ దర్శకత్వంలో ధనుష్ నటించనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఇందులో త్రిష నాయికగా ఖరారైంది. గతంలో ‘కొడి’ చిత్రంలో ధనుష్తో జోడీ కట్టింది త్రిష. సుదీర్ఘ విరామం తర్వాత ఈ జంట వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవడం విశేషం. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు.