Trisha | సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష ఇటీవల పెళ్లి వార్తలలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.. తన తోటి హీరోయిన్స్ అందరు పెళ్లి చేసుకుంటున్నా త్రిష మాత్రం సింగిల్గానే ఉంటూ సినీ కెరీర్ను విజయవంతంగా కొనసాగిస్తుంది. నాలుగు పదుల వయసు దాటిన తర్వాత కూడా గ్లామర్తో అలరిస్తుంది. అయితే ఇటీవల చంఢీగఢ్కు చెందిన ఓ వ్యాపారవేత్తతో త్రిష వివాహం ఫిక్స్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. తల్లిదండ్రుల ఒప్పందంతో ఈ బంధం దాదాపు ఖరారయ్యిందని, త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్నారన్న రూమర్లు చక్కర్లు కొట్టాయి.
ఈ వార్తలపై చివరికి త్రిష స్పందించాల్సి వచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టిన పోస్ట్లో, ‘‘నా కోసం నా జీవితాన్ని ప్లాన్ చేస్తున్న వారిని నేనెప్పుడూ ప్రేమిస్తానండి. ఇప్పుడు నా హనీమూన్ షెడ్యూల్ కూడా చెబుతారేమోనని వేచి చూస్తున్నా’’ అంటూ సెటైరిక్గా రియాక్ట్ అయ్యారు. దీనితో త్రిష పెళ్లి వార్తల్లో నిజం లేదన్నది స్పష్టమైంది. ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఫ్యాన్స్ తమ అభిమాన నటి పోస్ట్కి స్టన్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. కాగా, 2015లో త్రిషకు ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియన్తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల ఆ నిశ్చితార్థం రద్దయింది. పెళ్లి తర్వాత సినిమాలు చేయడంపై అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ అప్పట్లో నడిచింది.
ప్రస్తుతం త్రిష కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్తో బిజీగా ఉంది. కోలీవుడ్, టాలీవుడ్లో వరుస సినిమాలతో ముందుకెళ్తున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు. వశిష్ట్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అలాగే సూర్య హీరోగా నటిస్తున్న ‘కరుప్పు’ సినిమాలో కూడా త్రిష లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆమె ఆర్.జె. బాలాజీ డైరెక్షన్లో పనిచేస్తున్నారు. 42 ఏళ్ల వయసులోనూ త్రిష సినిమాల్లో తన హవాను కొనసాగిస్తుండటం అభిమానులకు గర్వకారణంగా మారింది.