సకుటుంబ ప్రేక్షకుల ఆదరణ వల్లే ‘ఎఫ్ 3’ సినిమా వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని, కోవిడ్ తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంత భారీ వసూళ్లు సాధించడం సంతోషంగా ఉందని అన్నారు నిర్మాత దిల్ రాజు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రిపుల్ బ్లాక్బస్టర్ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ…‘ప్రతికూల పరిస్థితుల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఇంత భారీ విజయం సాధించడం ప్రత్యేకంగా అనిపిస్తున్నది. సినిమాను ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఇంతగా ఆదరిస్తున్నారు కాబట్టి ‘ఎఫ్ 4’ కూడా రెడీ చేస్తున్నాం. త్వరలోనే ఆ సినిమాను ప్రకటిస్తాం’ అన్నారు. హీరో వెంకటేష్ మాట్లాడుతూ..‘నా సూపర్ హిట్ చిత్రాలెన్నో వైజాగ్లో చేశాను. ఇవాళ ‘ఎఫ్ 3’ సక్సెస్ సెలబ్రేషన్స్కు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. ‘నారప్ప’, ‘దృశ్యం 2’ సినిమాలు ఓటీటీలోకి వెళ్లడంతో నా అభిమానులు నిరాశపడ్డారు. అందుకే ‘నారప్ప’ గెటప్లో వచ్చి ఈ సినిమాలో థ్రిల్ చేశాను. మంచి స్క్రిప్ట్తో వస్తే విజయం ఇస్తామని మరోసారి చాటారు’ అన్నారు. ‘నవ్వుకోవడానికే ఈ సినిమా తీశాం. ఆ నవ్వుల విలువ వంద కోట్ల రూపాయలని మీరు ఇవాళ నిరూపించారు’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. వరుణ్ తేజ్ మాట్లాడుతూ..‘రెండు వందల మంది ఆర్టిస్టులు రెండేళ్ల పాటు పడిన కష్టం ఈ సినిమా. మా కష్టానికి మీరు నవ్వుతూనే ప్రతిఫలం ఇచ్చారు. వసూళ్లు, రికార్డులు ఇవ్వలేని సంతృప్తి మీరు సినిమాపై చూపించే ఆదరణతో దక్కుతుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు శ్రీనివాసరెడ్డి, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.