Serial Actor Chandu | తెలుగు ఇండస్ట్రీలో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య సంచలనంగా మారింది. త్రినయిని సీరియల్ నటి పవిత్ర జయరాం హఠాన్మరణంతో కుంగిపోయిన చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం బయటకొచ్చింది. తాజాగా దీనిపై చందు భార్య శిల్ప స్పందించింది. ఆరేండ్లుగా పవిత్ర జయరాంతో చందు రిలేషన్లో ఉన్నాడని బయటపెట్టింది. త్రినయిని సీరియల్ ప్రాజెక్టు వచ్చినప్పటి నుంచే చందు, పవిత్ర మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందని తెలిపింది.
నిజానికి చందు తన వెంటపడి, ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడని శిల్ప తెలిపింది. తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పింది. కానీ పవిత్ర మాయలో పడిన చందు గత ఐదేండ్లుగా తమను పట్టించుకోవడం మానేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. పవిత్రతో రిలేషన్ కారణంగా తనను, పిల్లల్ని వదిలేశాడని.. ఐదేండ్లుగా ఇంటికి రావడం లేదని తెలిపింది. అప్పట్నుంచి తమతో మాట్లాడటం కూడా లేదని చెప్పింది. పవిత్ర ఆకస్మిక మరణంతో డిప్రెషన్కు గురైన చందు మూడు రోజుల క్రితం కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడని కూడా తెలిపింది. పవిత్ర నీ దగ్గరకు వస్తున్నా అంటూ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా పెట్టినట్లు చెప్పింది.
చందు ఆత్మహత్యపై అతని తండ్రి వెంకటేశ్ కూడా స్పందించాడు. పవిత్రతో రిలేషన్లో ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, భార్యాపిల్లలను చందు వదిలేశాడని చెప్పాడు. ఐదేండ్లుగా తమ ఇంటికి కూడా రాలేదని తెలిపాడు. అయితే మూడు రోజుల క్రితం తమ ఇంటికి వచ్చిన చందు.. పవిత్ర దగ్గరకు వెళ్లిపోతున్నా అని చెప్పాడని అన్నాడు. నిన్న ఉదయం లక్డీకపూల్ వెళ్లొస్తానని చెప్పి తిరిగి రాలేదన్నాడు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి.. తెలిసిన వ్యక్తిని చందు ఫ్లాట్కు పంపించామని చెప్పాడు. అప్పుడే చందు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసిందన్నాడు.