ధనుష్ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. సంయుక్తమీనన్ కథానాయిక. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం హైదరాబాద్లో ట్రైలర్ విడుదల చేశారు. విద్యను వ్యాపార వస్తువుగా మార్చుకొని సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న కొందరు వ్యక్తుల మీద ఓ సామాన్యుడు సాగించిన పోరాటం నేపథ్యంలో ట్రైలర్ ఆకట్టుకుంది. ‘డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది’ వంటి సంభాషణలు మెప్పించాయి.
ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ ‘తెలుగులో నా తొలి చిత్రమిది. అందుకే చాలా ప్రత్యేకంగా భావిస్తున్నా. కథ వినగానే బాగా నచ్చింది. ఇలాంటి సామాజిక సందేశాత్మక కథను నాకు ఇచ్చినందుకు దర్శకుడికి కృతజ్ఞతలు’ అన్నారు. ‘లాక్డౌన్ టైంలో ఈ కథ రాసుకున్నా. ఆ సమయంలో పెద్ద హీరోలెవరూ కథలు వినే ధైర్యం చేయలేదు. కానీ ధనుష్ మాత్రం కథ చెప్పడానికి రమ్మన్నారు. ఆయన కథ అంగీకరించినప్పుడు ఆనందంలో మాటలు రాలేదు’ అని దర్శకుడు అన్నారు. చక్కటి సామాజిక సందేశంతో సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని హైపర్ ఆది పేర్కొన్నారు.