చిన్నప్పటి నుంచి ప్రతీ సమస్యను అమ్మతో పంచుకొని చర్చించడం అలవాటు చేసుకున్నానని, ఆమె ఇచ్చిన మనోైస్థెర్యంతోనే ఎలాంటి కష్టాల్నైనా చిరునవ్వుతో జయిస్తున్నానని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ఈ మధ్యకాలంలో తనపై సోషల్మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయని, శృతిమించిన విమర్శలకు తప్పకుండా తగిన జవాబిస్తానని ఆమె పేర్కొంది. రష్మిక మందన్న మాట్లాడుతూ ‘నా చిన్నతనమంతా ఇంటికి దూరంగా హాస్టల్లోనే గడిచింది. పాఠశాలలో ఎక్కువగా ఎవరితో కలిసేదాన్ని కాదు. దాంతో చాలా మంది నాకు పొగరు అనుకొని అపార్థం చేసుకునే వారు.
ఒక్కోసారి గదిలో కూర్చొని ఒంటరిగా ఏడ్చిన సందర్భాలున్నాయి. జీవితంలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని, చిన్న సమస్యలకే కుంగిపోతే ఎలా అంటూ అమ్మ చెప్పిన మాటలు నాలో విశ్వాసాన్ని పెంచాయి. ఆమె మాటల స్ఫూర్తితో ఎంతటి బాధలో ఉన్నా నవ్వుతూనే ఉంటా’ అని రష్మిక మందన్న పేర్కొంది. సోషల్మీడియా ట్రోల్స్ గురించి మాట్లాడుతూ ‘సద్విమర్శల్ని స్వీకరిస్తా. పరిధి దాటి చేసే విమర్శలపై ఎవరైనా సరే ఎదురు తిరిగి స్పందించాల్సిందే’ అని పేర్కొంది. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ‘పుష్ప-2’ చిత్రంలో నటిస్తున్నది.