కిట్టీ పార్టీల పేరుతో శిల్పా చౌదరి చాలా మందిని మోసం చేసింది. పార్టీల్లో పరిచయమైన వారి నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేసి, ఆ తర్వాత కనిపించకుండా మకాం మార్చేసింది. ఆమె చేతిలో మోసపోయిన వారి పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. ఇటీవల మహేశ్ బాబు సోదరి, యువ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని.. శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. 2 కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకుని, తిరిగి ఇవ్వలేదని కంప్లైంట్లో పేర్కొన్నారు.
తాజాగా శిల్పా చౌదరి మాయమాటలు నమ్మి యువ హీరో హర్ష్ కనుమల్లి నట్టేట మునిగాడు. ‘సెహరి’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు హర్ష్. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఈవెంట్ లో బాలయ్య కూడా పాల్గొనడంతో అప్పట్లో కాస్త బజ్ వచ్చింది. అయితే ఈ సినిమా సమయంలో హర్ష్ తో స్నేహం చేసుకుంది శిల్పా. పలు కారణాలు చెప్పి దాదాపు రూ.3 కోట్లు వరకు తీసుకుంది . ఓ స్టార్ హీరో కూడా ఆమె మాయలో పడి మోసపోయినట్టు తెలుస్తుంది.
శిల్పాచౌదరి మోసం చేసినవారి జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారు బాధితులు. శిల్పా చౌదరి 50 కోట్ల రూపాయలు హవాలా ద్వారా దుబాయ్ తరలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిల్పాచౌదరికి ఉన్న 6 బ్యాంక్ అకౌంట్స్పై ఆరా తీస్తున్నారు దర్యాప్తు అధికారులు. దాదాపు రూ. 200 కోట్లు రూపాయలు శిల్పా చౌదరి అందరి దగ్గర నుండి వసూలు చేసినట్టు సమాచారం.