టాలీవుడ్లో కొన్ని సినిమాలుంటాయి. ఏళ్ళు గడిచిన వాటికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. చూసిని ప్రతి సారిగా కొత్తగా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి. అలాంటి సినిమాల్లో ‘అతడు’ ఒకటి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓ కల్ట్ క్లాసిక్. సినిమా వచ్చి 13ఏళ్ళు దాటినా ఇప్పటికి టీవీల్లో వస్తుందంటే అతుక్కుపోతుంటాం. తినగా తినగా వేప తియ్యనుండు లాగా, అతడు సినిమా ఎన్ని సార్లు చూసినా.. ప్రతి సారి ఓ కొత్త అనుభూతిని పొందుతూనే ఉంటాం. కథ, కథనం, త్రివిక్రమ్ డైలాగ్స్, నటీనటులు పర్ఫార్మెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటీ ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ అద్భుతమే. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ఓ ఇంపార్టెన్స్ ఉంటుంది. ముఖ్యంగా నాజర్ పోషించిన మూర్తి రోల్ మాత్రం ప్రశంసనీయం. ‘ఈ వయస్సులో నాకు కావాల్సింది నిజాలు, అబద్ధాలు కావు.. జ్ఞాపకాలు’ ఈ ఒక్క డైలాగ్తోనే ఆ పాత్ర స్వభావం ఎంటో తెలిసిపోతుంది. ఇంత గొప్ప క్యారెక్టర్ను ఓ సీనియర్ స్టార్ హీరో చేయనన్నాడట.
ఇంతకీ ఎవరా? సీనియర్ స్టార్ హీరో అనుకుంటున్నారు. అతను మరెవరో కాదు సోగ్గాడు శోభన్ బాబు. హీరోగా ఎన్నో గొప్ప గొప్ప చిత్రాల్లో నటించి ఆంధ్రుల అందగాడుగా ప్రేక్షకుల్లో చెరిపోని ముద్ర వేసుకున్నాడు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా శోభన్ బాబు అద్భుతమైన విజయాలు అందుకున్నాడు. కాగా మూర్తి పాత్ర కోసం ముందుగా త్రివిక్రమ్, మురళిమోహన్లు.. శోభన్ బాబును సంప్రదించారట. కానీ శోభన్బాబు ఈ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించాడట. తాజాగా నటుడు, ఈ చిత్ర నిర్మాత మురళి మోహన్ ఈ పాత్ర గురించి ఆసక్తికర విషయాలను చెప్పాడు.
‘అతడు’ కథ వినగానే మురళి మోహన్ అందుతో తాత క్యారెక్టర్ శోభన్బాబు చేస్తే బావుంటుందని భావించాడట. అదే విషయం త్రివిక్రమ్కు చెప్పాడట. ఇక త్రివిక్రమ్ కూడా ఆయన చేస్తే అంతకంటే కావాల్సింది ఏముంది అన్నాడట.ఇక మురళిమోహన్.. శోభన్బాబును డైరెక్ట్గా అడగలేక.. ఓ బ్లాంక్ చెక్కు పై సైన్ చేసి చెన్నైలో నివాసముంటున్న శోభన్బాబు దగ్గరకు మేకప్ మ్యాన్ను పంపించ్చాడట. అయితే మురళీమోహన్ ఆఫర్ని శోభన్ బాబు సున్నితంగా తిరస్కరించారట. నేను హీరోగా పరిశ్రమకు పరిచయమయ్యాను, హీరోగా చిత్రాలు చేశాను. హీరోగా రిటైర్ అయ్యాను. ప్రేక్షకులకు శోభన్ బాబు అంటే హీరోగానే తెలుసు. నేను అలాగే ఉండాలి అనుకుంటున్నాను. తాత, తండ్రి లాంటి ముసలి పాత్రలు నేను చేయనని నిర్మొహమాటంగా చెప్పారట. అలా పార్థు తాత క్యారెక్టర్ శోభన్బాబు నుండి నాజర్ దగ్గరకు వెళ్ళింది.