Dil Raju | ‘ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత. ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదు. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘంలోనూ చర్చించాం. ఇక హీరోలు రెమ్యునరేషన్ విషయంలో పునరాలోచించుకోవాలి. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను’ అన్నారు అగ్ర నిర్మాత దిల్రాజు. ఆయన నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ‘తమ్ముడు’ చిత్రం జూలై 4న ప్రేక్షకుల ముందుకురానుంది.
లయ, వర్ష బొల్లమ్మ, సప్తమిగౌడ కీలక పాత్రధారులు. బుధవారం ట్రైలర్ను విడుదల చేశారు. దిల్రాజు మాట్లాడుతూ “సినిమా హిట్ అయ్యాక మీరే పిలిచి రెమ్యునరేషన్ ఇవ్వండి’ అని దర్శకుడు శ్రీరామ్ వేణు నాతో అన్నారు. నితిన్ పరిస్థితిని అర్థం చేసుకొని ‘రాజుగారు మీరు ఎంత పంపిస్తారో పంపించండి, రెమ్యునరేషన్ పెద్దగా డిమాండ్ చేయను’ అన్నాడు.
దిల్రాజుకే ఇలా హీరో, డైరెక్టర్ మద్దతునిస్తున్నారంటే..అది ఎంత అవసరమో అందరూ ఆలోచించాలి. టీజర్,ట్రైలర్ల వ్యూస్ నంబర్లను కొనొద్దని, ఒరిజినల్ వ్యూస్ మాత్రమే ఉండాలని నా పీఆర్ టీమ్కు చెప్పాను. సినీ పరిశ్రమలో చాలా మార్పులు రావాలి’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వేణు శ్రీరామ్, హీరో నితిన్ మాట్లాడుతూ చిత్ర విజయంపై ధీమా వ్యక్తం చేశారు.