తెలుగు చిత్రసీమ గత ఏడాదిన్నరగా కరోనా సృష్టించిన సంక్షోభ పరిస్థితులతో సతమతమైంది. థియేటర్లు మూతబడటం, షూటింగ్లు నిరవధికంగా వాయిదాపడటంతో ఆర్థికంగా కుదేలైంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండటంతో పరిశ్రమ క్రమంగా తెరిపినపడుతున్నది. మరోవైపు అగ్రహీరోలు వరుసగా పలు భారీ సినిమాల్ని అంగీకరిస్తూ ఇండస్ట్రీకి నూతన జవసత్వాల్ని అందించే ప్రయత్నంలో ఉన్నారు. ఒకప్పుడు అగ్రహీరో సినిమా ఏడాదికి ఒకటి వస్తే చాలనునేవారు. ప్రస్తుతం ఈ ధోరణిలో మార్పు కనిపిస్తున్నది. సినిమాల విషయంలో ఏమాత్రం కాలయాపన చేయకుండా కెరీర్ను పరుగులు పెట్టించేందుకు అగ్రహీరోలు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం ఒక్కోఅగ్రహీరో చేతిలో నాలుగైదు సినిమాలుండటం పరిశ్రమకు శుభపరిణామంగా భావిస్తున్నారు.
అగ్రహీరో చిరంజీవి 150 సినిమాల మైలురాయిని దాటినా ఏమాత్రం తగ్గేదేలే అంటూ కెరీర్లో దూకుడు మీదున్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దేవుడి మాన్యాల అన్యాక్రాంతం అంశంతో వాణిజ్య పంథాలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆయన ఆచార్యుడిగా, నక్సలైట్గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 4న విడుదలకానుంది. ఈ సినిమాతో పాటు చిరంజీవి లైనప్లో మరో మూడు సినిమాలున్నాయి. మలయాళ ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ఫాదర్’ ఇటీవలే ప్రారంభమైంది. మోహన్రాజా దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ అనంతరం మోహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’ (తమిళ ‘వేదాళం’ రీమేక్) చిత్రంలో నటించనున్నారు. బాబీ దర్శకత్వంలో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. వరుస సినిమాలతో చిరంజీవి రాబోవు ఏడాదికాలం బిజీగా గడపబోతున్నారు.
‘బాహుబలి’ సిరీస్ కోసమే నాలుగేళ్ల సమయాన్ని వెచ్చించారు ప్రభాస్. ఆ సినిమా పాన్ఇండియా ఇమేజ్ తీసుకొచ్చినప్పటికీ అంత కాల వ్యవధిలో ఒకే సినిమా చేయడంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. దాంతో స్పీడ్ పెంచారాయన. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ పూర్తయింది. యూరప్ నేపథ్యంలో నడిచే ప్రేమకథా చిత్రమిది. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. దీనితో పాటు ప్రభాస్ ‘ఆదిపురుష్’ ‘సలార్’ చిత్రాల షూటింగ్స్తో బిజీగా ఉన్నారు. నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందించనున్న సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం సంక్రాంతి తర్వాత సెట్స్మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలతో పాటు ఇటీవలే సందీప్రెడ్డి వంగా (‘అర్జున్రెడ్డి’ ఫేమ్) దర్శకత్వంలో ‘స్పిరిట్’ పేరుతో ఓ సినిమాకు అంగీకరించారు. ఇలా వరుస ప్రాజెక్ట్లతో ప్రభాస్ సినిమా డైరీ ఫుల్గా కనిపిస్తున్నది. మరో రెండేళ్ల వరకు ఆయన డేట్స్ ఖాళీగా లేవంటున్నారు.
సెకండ్వేవ్ ఆరంభానికి ముందు ‘వకీల్సాబ్’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు పవన్కల్యాణ్. ప్రస్తుతం ఆయన ‘భీమ్లానాయక్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకుడు. సంక్రాంతికి రానుంది. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరిహరవీరమల్లు’ కూడా చిత్రీకరణ జరుపుకొంటున్నది. మొఘల్ కాలం నాటి కథకు సమకాలీన అంశాల్ని మేళవించి పీరియాడిక్ చిత్రంగా రూపొందిస్తున్నారు. యాభైశాతం చిత్రీకరణ పూర్తయింది. ఇటీవలే హరీష్శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్సింగ్’ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు పవన్కల్యాణ్. సామాజిక అంశాలను స్పృశిస్తూ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రాలతో పాటు సురేందర్రెడ్డి దర్శకత్వంలో రామ్తాళ్లూరి నిర్మించనున్న చిత్రాన్ని వచ్చే ఏడాది పట్టాలెక్కించబోతున్నారు.
మహేష్బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చిత్రీకరణలో ఉన్నారు. పరశురామ్ దర్శకుడు. బ్యాంక్ నేపథ్యంలో జరిగే ఆర్థిక నేరాలు, రైతు సమస్యల్ని చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనంతరం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. అడవి నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ కథాంశమిదని సమాచారం. వచ్చే ఏడాది సెట్స్మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్బాబు ఓ సినిమాకు అంగీకరించిన విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయిక. ఈ ప్రాజెక్ట్ సైతం వచ్చే ఏడాదే పట్టాలెక్కనుంది.
రామ్చరణ్ నుంచి సినిమా వచ్చి రెండేళ్లయింది. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నారు. చిత్రీకరణ పూర్తయింది. జనవరి 7న ప్రేక్షకులముందుకురానుంది. అగ్ర దర్శకుడు శంకర్ నిర్దేశకత్వంలో రామ్చరణ్ ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్రాజు తెరకెక్కించబోతున్నారు. ఈ నెలలోనే సెట్స్మీదకు వెళ్లనుంది. గౌతమ్ తిన్ననూరి (‘మళ్లీరావా’ ‘జెర్సీ’ ఫేమ్) దర్శకత్వంలో రామ్చరణ్ ఇటీవలే ఓ సినిమాకు ఓకే చెప్పారు. అధికారిక ప్రకటన కూడా వెలువడింది. శంకర్ సినిమా అనంతరం ఈ ప్రాజెక్ట్ను ఆరంభించబోతున్నారు. ‘ఆచార్య’ చిత్రంలో రామ్చరణ్ కీలకమైన అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్చరణ్తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నారు. దీని అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత వీరిద్దరి కలయికలో ఈ సినిమా రాబోతుండటం ఆసక్తిగా మారింది. వీటితో పాటు త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో రానున్న చిత్రం వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇలా అగ్రహీరోలందరు చేతినిండా సినిమాలతో రాబోవు రోజుల్లో అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నారు. అదే తరుణంలో పరిశ్రమను తిరిగి కళకళలాడించేందుకు సన్నద్ధమవుతున్నారు.