Tollywood | తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ఆదివారం సమావేశం జరుగనున్నది. ఈ సమావేశానికి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి సారధ్యం వహించనున్నదని తెలుస్తున్నది. ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో ఈ సమావేశం జరుగుతుందని సమాచారం. 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కరోనా మహమ్మారి వేళ సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆటంకాలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇటీవల జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమంపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలియవచ్చింది.
ఈ సమావేశానికి రావాల్సిందిగా ఫిల్మ్ ఛాంబర్లోని ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, డిస్టిబ్యూటర్స్ అసోసియేషన్, స్టూడియో సెక్టార్, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్ సహా అన్ని సంఘాలను సమావేశానికి ఆహ్వానించారు. సుమారు 200 మందికిపైగా ప్రముఖులు ఈ సమావేశానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు, సినీ పెద్దలు చిరంజీవి, మోహన్బాబు, మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్తో చిరంజీవి భేటీ కంటే ముందే ఈ సమావేశం జరుగాల్సి ఉంది. కానీ రెండు సార్లు వాయిదా పడింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యలు, ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తూ ఈనెలాఖరులో ఉత్తర్వులు జారీ చేయనున్న క్రమంలో ఆదివారం జరుగనున్న సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.