Tollywood Disasters 2023 | ఏడాది ఏదైనా డిజాస్టర్స్ మాత్రం కామన్. 2023 లోనూ ఇదే జరిగింది. నెలకు కనీసం మూడు డిజాస్టర్స్ వచ్చాయి. అందులోనూ స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా ఉండడంతో నష్టాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. మరి 2023లో భారీ అంచనాల మధ్య వచ్చి నిరాశపరిచిన సినిమాలు ఏంటో.. అత్యధిక నష్టాలు తీసుకొచ్చిన ఆ మూవీస్ ఏంటో ఒక ఆర్డర్లో చూద్దాం..
ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్గా నిలిచింది. తెలుగు, హిందీలో కలిపి ఈ సినిమాకు దాదాపు 100 కోట్ల నష్టాలు వచ్చాయి. 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన కూడా బిజినెస్ అంతకేమించి జరగడంతో నష్టాలు భారీగా ఉన్నాయి.
భోళాశంకర్:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న విడుదలైంది. ఇది కూడా ఊహించిన దానికంటే పెద్ద డిజాస్టర్ అయింది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా అయినా కూడా కనీసం ఓపెనింగ్స్ తీసుకురాలేకపోయింది. దాదాపు 55 కోట్లు నష్టాలు తీసుకొచ్చింది ఈ సినిమా.
ఏజెంట్:
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ ఏజెంట్ దాదాపు 40 కోట్లకు పైగా నష్టాలు తీసుకువచ్చింది. ఈ సినిమా కోసం 80 కోట్లు ఖర్చు చేసాము అని చెప్పారు ఏకే ఎంటర్టైన్మెంట్స్. కానీ వచ్చిన కలెక్షన్స్ మాత్రం కనీసం 10 కోట్లు కూడా లేవు. దాంతో ఊహించిన దాని కంటే ఎక్కువ నష్టాలు వచ్చాయి.
శాకుంతలం:
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన మైథిలాజికల్ మూవీ శాకుంతలం. దీనికోసం భారీగానే ఖర్చు పెట్టాడు గుణశేఖర్. కానీ నష్టాలు కూడా అదే రేంజ్లో వచ్చాయి. ఏప్రిల్లో విడుదలైన ఈ సినిమా కనీసం 10 కోట్ల షేర్ కూడా తీసుకురాలేదు. సమ్మర్ సీజన్ కూడా శాకుంతలంకు హెల్ప్ అవ్వలేదు. బడ్జెట్ 60 కోట్లకు పైగానే ఉండటంతో నష్టాలు 50 కోట్లకు పైగానే వచ్చాయి.
రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు:
వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ అదే జోరు కంటిన్యూ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. సమ్మర్లో విడుదలైన రావణాసుర దాదాపు 15 కోట్ల నష్టాలు తీసుకొస్తే.. దసరాకు వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా దాదాపు 15 కోట్లకు పైగా నష్టాలు తీసుకువచ్చింది. ఈ రెండు సినిమాలు కలిపి ఒకే ఏడాది 30 కోట్ల నష్టాలు అందించాడు రవితేజ.
కస్టడీ:
రెండు మూడు సంవత్సరాలుగా వరుస పరాజయాలలో ఉన్న నాగచైతన్యకు 2023 కూడా కలిసి రాలేదు. ఈ ఏడాది వెంకట్ ప్రభు తెరకెక్కించిన కస్టడీ సినిమాతో వచ్చాడ ఈయన. ఇది కనీసం 5 కోట్ల షేర్ కూడా వసూలు చేయలేదు. ఇంకా చెప్పాలంటే కష్టపడి అనే సినిమా వచ్చినట్టు కూడా ప్రేక్షకులకు ఐడియా లేదు. దీన్ని బట్టి డిజాస్టర్ రేంజ్ అర్థమైపోతుంది.
బ్రో:
మెగా హీరోలకు 2023 పెద్దగా కలిసి రాలేదు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసిన నటించిన బ్రో సినిమా దాదాపు 30 కోట్ల నష్టాలు తీసుకొచ్చింది. సముద్రఖని తెరకెక్కించిన ఈ సినిమాకు బిజినెస్ ఎక్కువగా చేయడంతో కలెక్షన్స్ వేటలో బాగా వెనుకబడింది బ్రో. 90 కోట్ల లక్ష్యంతో వచ్చిన బ్రో.. 65 కోట్ల దగ్గరే ఆగిపోయాడు.
గాండీవధారి అర్జున:
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన గాండీవదారి అర్జున సినిమాను 50 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించామని చెప్పారు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్. కానీ ఈ సినిమాకు కనీసం 5 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు. దాంతో నష్టాలు అతి భయంకరంగా వచ్చాయి.
ఆదికేశవ:
ఉప్పెన సినిమా తర్వాత ఆ రేంజ్ విజయం కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఈ ఏడాది ఆయన నటించిన ఆదికేశవ సినిమా వచ్చింది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజే చాప చుట్టేసింది. ఫుల్ రన్లో కనీసం 5 కోట్లు కూడా వసూలు చేయలేదు ఆదికేశవ.
ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్:
నితిన్ పరాజయాల పరంపర ఈ ఏడాది కూడా కంటిన్యూ అయింది. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ మూడు రోజుల ముచ్చటగానే మిగిలిపోయింది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా కరెక్ట్గా రాలేదు. ఎదురుగా హాయ్ నాన్న ఉండడంతో పూర్తిగా తేలిపోయింది నితిన్ సినిమా.
ఇవి మాత్రమే కాదు కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన అమిగోస్, నిఖిల్ పాన్ ఇండియన్ సినిమా స్పై, సుధీర్ బాబు హంట్, మామా మష్చీంద్ర లాంటి సినిమాలు కూడా కనీసం వచ్చి పోయినట్టు ప్రేక్షకులకు ఐడియా లేదు.