Rajamouli | కొందరు దర్శకులు హీరోలను మారుస్తుంటారు.. నిర్మాతలను మారుస్తుంటారు.. కానీ వాళ్ల టెక్నీషియన్స్ను మాత్రం అలాగే జాగ్రత్తగా చూసుకుంటారు. ఎన్ని సినిమాలు చేసిన వాళ్లనే రిపీట్ చేస్తూ ఉంటారు. కావాలంటే రాజమౌళిని తీసుకోండి. ఆయన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు కేవలం కీరవాణి మాత్రమే సంగీతం అందిస్తూ వస్తున్నాడు. ఇండస్ట్రీకి ఎంతమంది కొత్త సంగీత దర్శకులు వచ్చినా.. అద్భుతంగా పాటలు ఇస్తున్న కూడా పెద్దన్న మీద తప్ప పక్క వాళ్ల మీద నమ్మకం పెట్టుకోడు దర్శక ధీరుడు.
తనకు కావాల్సిన మ్యూజిక్ కేవలం కీరవాణి నుంచి మాత్రమే రాబట్టుకుంటూ ఉంటాడు. అలాగే ఆయనకు ఆస్కార్ అవార్డు కూడా తీసుకొచ్చి పెట్టాడు రాజమౌళి. మహేశ్ బాబు సినిమాకు కూడా కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అయితే సంగీత దర్శకుడు విషయంలో రిస్కు తీసుకోకపోయినా.. మిగిలిన వాళ్ల విషయంలో మాత్రం రాజమౌళి మొదటి సారి సాహసం చేస్తున్నాడు. తనకు కావలసిన వాళ్లను కాకుండా ఇతర టెక్నీషియన్స్ తో ముందుకు వెళ్తున్నాడు. రాజమౌళి సినిమా అంటే పోస్టర్ మీద సినిమా సినిమాటోగ్రాఫర్గా సెంథిల్ కుమార్ పేరు కనిపించాల్సిందే.. కానీ మహేశ్ బాబు సినిమాకు మాత్రం ఆయన కాకుండా పీఎస్ వినోద్ వచ్చాడు. సెంథిల్ దర్శకుడిగా మారుతుండటంతో ఆయన స్థానంలో వినోద్ను తీసుకున్నాడు రాజమౌళి.
అలాగే విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్గా బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు పని చేసిన శ్రీనివాస మోహన్ను కాకుండా బాహుబలి 2 కోసం పనిచేసిన కమల్ కణ్ణన్ వస్తున్నాడు. ఇక ఎడిటర్గా శ్రీకర్ ప్రసాద్ కాకుండా మరొకరి వైపు వెళ్తున్నాడు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ సబు సిరిల్ కాకుండా ఇంకొకరిని తీసుకుంటున్నాడు దర్శక ధీరుడు. ఈ మార్పులు అన్నీ చూస్తుంటే మహేశ్ కోసం చాలా మారినట్లు అర్థమవుతుంది. అంతేకాదు ఈ సినిమాలో నటించబోయే నటీనటులు కూడా ఎక్కువగా హాలీవుడ్ నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా మహేశ్ కోసం ఇంతకు ముందు పనిచేసిన టీంతో కాకుండా కొత్త వాళ్లతో ముందుకు వెళుతున్నాడు రాజమౌళి. ఈ సినిమా ఆగస్టులో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలుపెట్టి 2026 సమ్మర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అడ్వెంచర్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను సౌతాఫ్రికా అడవుల్లో ఎక్కువ భాగం షూటింగ్ చేయబోతున్నారు.