అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరల వ్యవహారంపై సీఎం జగన్తో (CM Jagan) సినీ ప్రముఖులు సమావేశమవనున్నారు. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, మహేశ్బాబు, ప్రభాస్ గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రితో భేటీ అవుతారు. ఈ సమావేశంలో సినిమా టికెట్ల ధరలు, చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం సాయం, ఇతర అంశాలు చర్చకు రానున్నాయి. సీఎం జగన్ సారథ్యంలో జరిగే ఈ సమావేశానికి మంత్రి పేర్ని నానితోపాటు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
గత నెలలో జరిగిన సమావేశానికి చిరంజీవిని మాత్రమే సీఎం జగన్ ఆహ్వానించారు. లంచ్ మీట్లో పలు అంశాల పైన చర్చించారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి పూర్తిగా సానుకూలంగా ఉన్నారని.. ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక రాగానే మరోసారి చర్చలు ఉంటాయని చిరంజీవి చెప్పిన విషయం తెలిసిందే.
కాగా, ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ కూడా… టికెట్ ధరలు పెంచాలని ప్రాథమికంగా సిఫార్సు చేసినట్లు సమాచారం. పరిశ్రమ ప్రతిపాదనలు, కమిటీ సిఫార్సులపై వారితో సీఎం చర్చించనున్నారు. ఎంతమేర టికెట్లు పెంచాలనే దానిపై అభిప్రాయాలు తీసుకోనున్నారు.
సీఎం జగన్తో భేటీ నేపథ్యంలో చిరంజీవి సహా ఇతర హీరోలు గురువారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలదేరుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు.