జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కార పథకం.. వివాద్ సే విశ్వాస్ కింద చెల్లింపుల గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకున్నది. కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యానే గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మరో 2 నెలలు పొడిగించింది. పొడిగించాలని ట్యాక్స్పేయర్లు, ట్యాక్స్ కన్సల్టెంట్లు, ఇతర భాగస్వాముల నుంచి తమకు విజ్ఞప్తులు వచ్చాయని ఈ సందర్భంగా సీబీడీటీ తెలిపింది. నిజానికి ఈ పథకం కింద డిక్లరేషన్ దాఖలుకున్న గడువు మార్చి 31తోనే ముగిసింది. కానీ ఏప్రిల్ 30కి పెంచగా, ఇప్పుడు మళ్లీ జూన్ ఆఖరుదాకా పెంచారు. అలాగే ట్యాక్సేషన్, ఇతర చట్టాల (సడలింపు), సవరణల నిబంధనల కింద వచ్చిన పలు నోటిఫికేషన్ల గడువునూ జూన్ 30దాకా పొడిగించారు. కాగా, వివాద్ సే విశ్వాస్ పథకం ద్వారా ఈ నెల తొలి వారం వరకు ఖాజానాకు దాదాపు రూ.54,000 కోట్ల ఆదాయం సమకూరింది. మరిన్ని డిక్లరేషన్లు ఇప్పటికే దాఖలైనందున ఆదాయం ఇంకా పెరుగవచ్చని అంచనా. వివాద్ సే విశ్వాస్ పథకాన్ని పన్ను వివాదాల పరిష్కారం కోసం కేంద్రం తీసుకువచ్చిన సంగతి విదితమే. పన్ను, వడ్డీ, జరిమానా లేదా ఫీజుల్లో ఏర్పడిన వివాదాలను ఈ పథకం కింద సులువుగా పరిష్కరించుకోవచ్చు. ఇదిలావుంటే ట్యాక్స్ ఆఫీసర్స్ మదింపు పునఃప్రారంభం కోసం నోటీస్ జారీకి సంబంధించి గడువు తేదీని కూడా పొడిగించారు.