Tiger Nageshwara Rao | చేతులు కాలాకా అకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్లుంది టైగర్ నాగేశ్వరరావు మేకర్స్ యవ్వారం. ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. కంటెంట్ కొత్తగా ఉందని తెలిస్తేనే థియేటర్లో సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా లెంగ్తీ రన్టైమ్ ఉన్న సినిమాలంటే ముందు నుంచే ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఒకవేళ సినిమాకు ఆహో ఓహో అన్న టాక్ వస్తే వెళ్లడానికి ఇష్టపడతారు కానీ.. యావరేజ్, ఎబో యావరేజ్ టాక్ వచ్చినా సరే రన్టైమ్ చూసి వెనకడుగు వేస్తున్నారు.
ఇప్పుడు ఎంత క్రిస్పీ రన్టైమ్తో సినిమాలు వస్తే అంత బెటర్ అన్నట్లు సాగుతుంది. ఇలాంటి టైమ్లో టైగర్ నాగేశ్వరరావు మూడు గంటల రన్టైమ్తో వస్తున్నాడంటే సినిమాలో ఏ రేంజ్లో మ్యాటర్ ఉండాలి. ఒక ప్రేక్షకుడుని మూడు గంటల పాటు థియేటర్లో కూర్చోబెట్టడం అంటే కత్తి మీద సామే అని చెప్పాలి. రాజమౌళి, సుకుమార్ వంటి ఒకరిద్దరు తప్ప మహామహులే ఈ విషయంలో తడబడ్డారు. అలాంటిది రెండో సినిమాకే వంశీ కృష్ణ మూడు గంటల రన్టైమ్తో వస్తున్నాడంటే కథ, కథనాలపై ఎంత గ్రౌండ్ వర్క్ చేసుండాలి.
ఎంతో ఇష్టపడి కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ మీద దర్శకులకు ఎంతైనా నమ్మకం ఉండొచ్చు. నిడివి ఎక్కువ ఉంటే ప్రేక్షకులు ఇంకా బాగా ఆస్వాదిస్తారనే ధీమా కలగొచ్చు. కానీ ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే అది ఏకంగా ఫలితం మీదే ప్రభావం చూపిస్తుంది. ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ బయోపిక్ను వంశీ కృష్ణ ఓ షేప్కు తీసుకొచ్చాడు. కానీ కథ చుట్టూ అల్లిన కొన్ని సీన్లు మాత్రం తేడా కొట్టేశాయి. మరీ ముఖ్యంగా సెకండాఫ్లో చాలా వరకు సీన్లు బోర్ తెప్పించాయి. ఆ ప్రభావం సినిమా రిజల్ట్పై పడింది. అసలు అంత రన్టైమ్ అవసరమే లేదని, చాలా సీన్లకు ఇంకా కత్తెర వేస్తే బాగుండేదని సినిమా చూసిన వారు అభిప్రాయపడ్డారు.
దాంతో చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాను 25 నిమిషాలు ట్రిమ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం నుంచి టైగర్ నాగేశ్వరరావు సినిమా 2గంటల 37 నిమిషాల నిడివితో ప్రదర్శితం కానుంది. ఇక ఇదేదో ముందే చేయోచ్చుగా అని పలువురు నెటిజన్లు చిత్ర యూనిట్ను ట్యాగ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే చాలా డ్యామేజీ జరిగిపోయింది. టాక్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ట్రిమ్ చేస్తే ఏం లాభం అని రవితేజ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరీ ఇలా అయిన టైగర్ నాగేశ్వరరావుకు కలిసి వస్తుందో లేదో చూడాలి.