కరోనా మహమ్మారి వలన సినీ పరిశ్రమకు ఎంత నష్టం చేకూరిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షూటింగ్స్ బంద్ కావడం, థియేటర్స్ మూతపడడంతో చాలా మంది కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది. నిర్మాతలు సైతం నష్టాలని చవి చూసారు. కొందరు భారీ నష్టాలను తట్టుకోలేక సినిమాలను ఓటీటీలో విడుదల చేశారు. అయితే జూలై 30 నుండి థియేటర్స్ తిరిగి తెరచుకోవడంతో వరుస సినిమాలు ప్రేక్షకులని అలరించేందుకు వస్తున్నాయి.
ఆగస్ట్ 27న చాలా మంది హీరోలు తమ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండడం ఆసక్తికరంగా మారింది. సుధీర్ బాబు హీరోగా రూపొందిన శ్రీదేవి సోడా సెంటర్ ఆగస్ట్ 27కి విడుదల తేదీని కన్ఫర్మ్ చేసుకున్న విషయం తెల్సిందే. శ్రీనివాస్ అవసరాల హీరోగా వచ్చిన హిలేరియస్ ఎంటర్టైనర్ 101 జిల్లాల అందగాడు కూడా అదే రోజున విడుదలను కన్ఫర్మ్ చేసుకుంది. ఈ చిత్ర కథను శ్రీనివాస్ అవసరాల అందించగా రాచకొండ విద్యాసాగర్ డైరెక్ట్ చేసాడు. క్రిష్, దిల్ రాజు సమర్పిస్తున్నారు.
సుశాంత్ హీరోగా రూపొందుతోన్న ఇచట వాహనములు నిలుపరాదు కూడా ఆగస్ట్ 27కి విడుదలను ఖరారు చేసుకుంది. కొత్త దర్శకుడు ఎస్ దర్శన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూడు సినిమాలతో పాటు మరో నాలుగైదు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయని సమాచారం. సెప్టెంబర్లో పెద్ద హీరోల సినిమాలు రానున్న నేపథ్యంలో చిన్న సినిమాలు వరుసగా క్యూ కడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.