అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘సలార్’ చిత్రం సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధమవుతుండగా..‘కల్కి 2898’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఇదిలా వుండగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరాంతంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ను నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించబోతున్నట్లు ప్రకటించారు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి ఆయనే స్వరకర్త. పోలీస్ డ్రామాగా తెరకెక్కనున్న ‘స్పిరిట్’ చిత్రాన్ని ఎనిమిది భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇందులో ప్రభాస్ తొలిసారి పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా హిందీలో రణబీర్కపూర్తో ‘యానిమల్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తవగానే ‘స్పిరిట్’ను పట్టాలెక్కిస్తారని సమాచారం.