‘థియేటర్స్లో సినిమా చూడటమనేది మన సంస్కృతిలో భాగంగా ఉంది. మన దేశంలో సినిమాకు మించిన ఎంటర్టైన్మెంట్ ఏదీ లేదు’ అని అన్నారు హీరో నాని. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ‘తిమ్మరుసు’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. మహేష్ కోనేరు, సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 30న విడుదలకానుంది. ప్రీ రిలీజ్ వేడుకలో నాని మాట్లాడుతూ ‘కొవిడ్ టైమ్లో ఇతర సంస్థలకంటే ముందుగానే థియేటర్స్ను మూసివేశారు. అన్నింటికంటే చివర్లో తెరుస్తున్నారు. బార్స్, పబ్స్తో పోలిస్తే థియేటర్స్ ఎంతో సురక్షితమైనవి. అన్నింటితో పాటే థియేటర్లను తెరిస్తే బాగుంటుంది.కొవిడ్ రాకుండా ఉంటే ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా థియేటర్లలో విడుదలయ్యుండేది. ఆ సినిమాతో సత్యదేవ్ స్టార్ అయ్యేవాడు. ఆ కల ‘తిమ్మరుసు’ ద్వారా నెరవేరాలి. భవిష్యత్తులో విడుదలయ్యే చిత్రాలకు ఇది ఆక్సిజన్ ఇవ్వాలి’ అని చెప్పారు. ‘సినీ పరిశ్రమలో రాణించడానికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. తపన, స్వీయ నమ్మకమే ఉంటే విజయాల్ని అందుకోవచ్చు. ఆ సిద్ధాంతాన్నే నేను నమ్ముతా’ అని సత్యదేవ్ అన్నారు.