‘సమ్మర్ వెకేషన్కి ఊరికెళ్లినట్టే, ఈ సారి మా ‘తిమ్మరాజుపల్లి’కి రండి. మీ ఊరు గుర్తొస్తుంది. నాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా 50ఏళ్లు దాటిన వారికి మా సినిమా బాగా నచ్చుతుంది. టీవీ కొనేందుకు, టీవీ చూసేందుకు వారెలా స్ట్రగుల్స్ పడ్డారు? ఎలాంటి అనుభూతికి లోనయ్యారు? అనేది వాళ్లకు మరోసారి గుర్తొస్తుంది. అలాగే 30, 40 ఏళ్ల వాళ్లకు కూడా సినిమా బాగా నచ్చుతుంది.
ఎందుకంటే వాళ్లు టీవీ తొలి వీక్షకులు కాబట్టి. మొత్తంగా ఈ సినిమా ఓ జ్ఞాపకాల దొంతర. మేం కష్టపడ్డామని సినిమా చూడమని చెప్పను. ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్, కంటెంట్ చూడండి. నచ్చితే థియేటర్స్కి వెళ్లి చూడండి’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. కొత్త ప్రతిభను పరిచయం చేయాలనే దృక్పథంతో తన కేఏ ప్రొడక్షన్స్ పతాకంపై సుమైనా స్టూడియోస్తో కలిసి కిరణ్ అబ్బవరం నిర్మించిన వైవిధ్యకథాచిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’.
సాయితేజ్, వేద జలంధర్ జంటగా నటించారు. వి.మునిరాజు దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ డ్రామా ఏప్రిల్ 17న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడారు. ఇంకా ఈ సినిమాలో భాగం అయినందుకు చిత్రబృందమంతా ఆనందం వ్యక్తం చేసింది.