Hanu Raghavapudi | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘సీతారామం’ ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో రాబోతున్న హిస్టారికల్ పీరియడ్ వార్ అండ్ లవ్ డ్రామా ‘ఫౌజీ’పై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హను రాఘవపూడి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ పాన్-ఇండియా విజువల్ వండర్ను నిర్మిస్తోంది. వచ్చే వింటర్ కానుకగా, డిసెంబర్ 2026లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ పంచుకున్న ఒక క్రేజీ అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ తనకు ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించిన కొన్ని రషెస్ చూపించారని, అవి చూశాక తనకు మైండ్ బ్లాక్ అయిందని నాగవంశీ పేర్కొన్నారు. చిత్ర యూనిట్ ఈ సినిమాను మనం ఊహించని రేంజ్లో, ఒక సరికొత్త హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కిస్తోందని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. నాగవంశీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్గా మారడంతో, ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే సినిమా ప్రమోషన్స్ షురూ చేయాలని, అఫీషియల్ టీజర్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయాలంటూ ఫ్యాన్స్ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ఈ అద్భుతమైన చిత్రంతో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్గా వెండితెరకు పరిచయమవుతుండటం విశేషం. అలాగే బాలీవుడ్ దిగ్గజ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, సీనియర్ నటి జయప్రద, రాహుల్ రవీంద్రన్, చైత్ర జె. ఆచార్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో చూడాలి.