Artificial Intelligence | ప్రస్తుతం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ కృత్రిమ మేధ వల్ల భవిష్యత్తులో తమ ఉపాధికే ముప్పువాటిల్లే అవకాశం ఉందని ఇటీవల హాలీవుడ్ నటులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిసారి తమిళ చిత్రంలో ఏఐ సాంకేతికతను ఉపయోగించడం ఆసక్తికరంగా మారింది. సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం ‘వెపన్’లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ టెక్నాలజీతో ఓ సీక్వెన్స్కు రూపకల్పన చేశామని దర్శకుడు గుహన్ సెన్నియప్పన్ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో సత్యరాజ్ సూపర్పవర్స్ ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. ఆయన యుక్త వయసు నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి వచ్చింది. దీనికోసం రెగ్యులర్ గ్రాఫిక్స్ బదులు ఏఐ టెక్నాలజీని ఉపయోగించాం. మిషన్ ఇంపాజిబుల్, డెడ్ రెకానింగ్-1 వంటి చిత్రాల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. అయితే ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్న తొలి చిత్రం మాదే. ఈ టెక్నాలజీతో హాలీవుడ్ పాత్రలను సులభంగా సృష్టించవొచ్చు. కానీ భారతీయ క్యారెక్టర్స్ విషయంలో కొన్ని ఇబ్బందులున్నాయి’ అన్నారు.