నైజాం ఏరియా సినిమా బిజినెస్ మొత్తం తన ఆధీనంలో ఉందన్నది కేవలం అపోహ మాత్రమేనని, ఇరవైఏళ్లుగా సినీరంగంలో సంపాదించుకున్న విశ్వసనీయత, వ్యాపార ప్రామాణికత తన విజయ రహస్యాలని చెప్పారు అగ్ర నిర్మాత దిల్రాజు. ఆయన సమర్పణలో శిరీష్ నిర్మాతగా రూపొందించిన తాజా చిత్రం ‘ఎఫ్-3’. వెంకటేష్, వరుణ్తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం దిల్ రాజు పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
‘ఎఫ్-3’ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. మనిషి మనుగడకు పంచభూతాలు అవసరం. వాటికి తోడుగా డబ్బు కూడా అత్యవసరం అనే కాన్సెప్ట్తో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కథ రాసుకున్నాడు. ప్రస్తుతం సమాజంలోని అన్ని వ్యవస్థల్ని డబ్బు శాసిస్తున్నది. మానవ సంబంధాల్ని కూడా డబ్బే నిర్ధేశిస్తున్నది. ఈ పాయింట్ను ఆద్యంతం వినోదాత్మక కోణంలో ఈ సినిమాలో ఆవిష్కరించాం.
గత ఆరు నెలలుగా ప్రేక్షకుల మైండ్సెట్ను గమనించాను. సినిమాల తాలూకు డే టూ డే కలెక్షన్స్ రిపోర్ట్స్ అన్నీ నాకు అందుబాటులో ఉంటాయి. వాటిని పరిశీలిస్తే కొందరు ప్రేక్షకులు సినిమాలకు దూరమవుతున్నారనే విషయం అర్థమైంది. ముఖ్యంగా రిపీటెడ్ ఆడియెన్స్ రావడం లేదు. ఆక్యుపెన్సీ శాతం కూడా బాగా తగ్గిపోయింది.
మరికొందరు ప్రేక్షకులు ఇంటికే పరిమితమవుతున్నారు. ఇవన్నీ గమనించి నేను రియలైజ్ అయ్యాను. ‘ఎఫ్-3’ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి టికెట్ రేట్లు తగ్గిస్తేనే కుటుంబాలన్నీ థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని భావించా. అందుకే ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం టికెట్ రేట్లను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నా.
ఈ విషయంలో నేను ముందడుగు వేశాననుకుంటున్నా. ఇది సత్ఫలితాలనిస్త్తే అందరూ అదే దారిలో ముందుకెళ్తారు. ఒకవేళ ఎవరికైనా అభ్యంతరాలుంటే వారిని నేను కన్విన్స్ చేయగలననే నమ్మకం ఉంది. ‘ఎఫ్-3’ చిత్రానికి టికెట్ రేట్లు తగ్గించడం మంచి నిర్ణయమని చాలా మంది మెచ్చుకున్నారు. ఇక సినిమాలకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఆదాయం సమకూరుతుంది. నాకు థియేట్రికల్ రెవెన్యూ మాత్రమే కిక్ నిస్తుంది. థియేటర్లో ప్రేక్షకుల హంగామా, ఓపెనింగ్ వసూళ్లు.. ఈ అంశాలన్నీ నిర్మాతలకు ఉత్సాహాన్నిస్తాయి.
ఒక మల్టీఫ్లెక్స్లో టికెట్ ధర 250 ఉంటే.. దానికి జత కలిసే 45 రూపాయల జీఎస్టీ ప్రభుత్వానికి వెళ్తుంది. 250 రూపాయల్లో సగం మల్టీఫ్లెక్స్ వాళ్లు తీసుకోగా…మిగతా సగం నిర్మాతలకు వస్తుంది. అంటే 250 టికెట్లో నిర్మాతకు 125 రూపాయల లాభం మాత్రమే వస్తుంది. ఈ లెక్కలన్నీ తెలియకుండా చాలా మంది నిర్మాతలే మొత్తం దోచుకుంటున్నారనే ఆరోపణలు చేస్తుంటారు.
ప్రస్తుతం నైజాంలో 450 థియేటర్లు ఉన్నాయి. అందులో అరవై థియేటర్లను మా సంస్థ లీజుకు తీసుకుంది. కేవలం 60 థియేటర్లతో నేను నైజాంను ఎలా శాసిస్తాను? నాపై నమ్మకంతో పంపిణీదారులు అడ్వాన్స్లు చెల్లిస్తారు. సినిమా విడుదలైన రెండు మూడు వారాల్లో వాళ్లతో బిజినెస్ డీల్ మొత్తం పూర్తి చేస్తాను.
మా సంస్థ నుంచి వరుసగా సినిమాలు వస్తాయి కాబట్టి బిజినెస్పరంగా డిస్ట్రిబ్యూటర్స్ మాకు తొలిప్రాధాన్యతనిస్తారు. ఈ రెండు కారణాల వల్లే మేము నైజాంలో రాణిస్తున్నాం. అంతేకాని నైజాం అంతా నా కంట్రోల్లో ఉంటుంది..నేను చెప్పిందే నడుస్తుందనే మాటలన్నీ అపోహలే. గత ఇరవై ఏళ్లుగా పరిశ్రమలో నేను సంపాదించుకున్న మర్యాద, విశ్వసనీయత వల్లే నా మాటకు మంచి విలువిస్తారు.