Director N.lingusamy | తమిళ దర్శకుడు లింగుస్వామికి చెక్ బౌన్స్ కేసులో న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2014లో లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ కలిసి కార్తి, సమంతలతో ‘ఎన్ని ఇజు నాల్’ అనే సినిమాను తెరకెక్కించాలని భావించారు. అందుకోసం పీవిపీ క్యాపిటల్ కంపెనీ నుంచి రూ.35 లక్షల వరకు అప్పు తీసుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దాంతో పీవిపీ సంస్థకు తిరిగి డబ్బుమొత్తాన్ని చెక్ రూపంలో ఇచ్చాడు. అయితే ఆ చెక్ బౌన్స్ అయింది. దాంతో పీవిపీ సంస్థ వారిపై చెక్ బౌన్స్ కేసు పెట్టింది.
కేసు విచారించిన న్యాయం స్థానం.. గతేడాది అగస్టులో లింగుస్వామికి చెక్ ఫ్రాడ్ కేసులో ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ, రిట్ పిటీషన్ దాఖలు చేసుకునేందుకు సమయమిచ్చింది. దీంతో లింగుస్వామి రూ.10 వేలు కోర్టుకు అపరాధ రుసుం చెల్లించి అనంతరం అప్పీల్ దాఖలు చేశాడు. తాజాగా విచారణ జరిపిన మద్రాస్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు లింగుస్వామికి విధించిన ఆరు నెలల జైలు శిక్షను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. ఈ జడ్జిమెంట్ గురించి ట్విట్టర్లో షేర్ చేసిన లింగుస్వామి.. మరోసారి అప్పీలుకు వెళ్తామని వెల్లడించారు.
ఇక లింగుస్వామి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘పందెంకోడి’, ‘అవారా’ సినిమాలను ఇప్పటికే క్యాసెట్ అరిగిపోయేనన్ని సార్లు చూశాం. ఇక గతేడాది రామ్పోతినేనితో ‘ది వారియర్’ అంటూ వచ్చాడు. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా మిగిలిపోయింది.