దేశంలో అతిపెద్దదైన లాజిస్టిక్ కంపెనీ వీఆర్ఎల్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ విజయ్ శంకేశ్వర్ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘విజయానంద్’. నిహాల్ రాజ్పుత్, సిరి ప్రహ్లాద్ జంటగా నటించారు. ఇతర పాత్రలను అనంత్ నాగ్, భరత్ బోపన, అనీష్ కురువిల్లా పోషించారు. రిషికా శర్మ దర్శకత్వంలో వీఆర్ఎల్ ఫిలింస్ పతాకంపై ఆనంద్ శంకేశ్వర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 9న విడుదలకానుంది. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో నటుడు అనీష్ కురువిల్లా మాట్లాడుతూ…‘రవాణా, మీడియా వంటి అనేక రంగాల్లో గొప్ప వ్యాపారవేత్తగా జీవితాన్ని సాగించారు విజయ్ శంకేశ్వర్. ఆయన జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందడం, అందులో నేను చిన్న భాగం కావడం సంతోషంగా ఉంది’ అన్నారు. నటుడు భరత్ బోపన మాట్లాడుతూ..‘ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే జీవితం విజయ్ శంకేశ్వర్ది.
ఈ చిత్రంలో విజయ్ శంకేశ్వర్ కొడుకు ఆనంద్ శంకేశ్వర్ పాత్రలో నటించాను. ఇన్స్పైరింగ్ మూవీని పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’ అన్నారు. దర్శకురాలు రిషికా శర్మ మాట్లాడుతూ…“మహానటి’ సినిమా స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఒక సాధారణ వ్యక్తి గొప్ప వ్యాపారవేత్తగా ఎధిగిన స్ఫూర్తికర ప్రయాణం ఈ సినిమా. తండ్రీ కొడుకుల మధ్య సాగే భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి’ అన్నారు.
హీరో నిహాల్ రాజ్పుత్ మాట్లాడుతూ…‘విజయ్ శంకేశ్వర్ గారిది మాదీ ఒకే ఊరు. ఆయన గురించి చిన్నప్పటి నుంచి పేపర్లలో చదువుతున్నాను. అలా ఆయనకు పెద్ద అభిమానిని అయ్యాను. ఈ బయోపిక్ కోసం ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు నా గురించి సినిమా చేయాలన్న ఆలోచన ఎప్పుడు కలగలేదన్నారు. వేల మందికి స్ఫూర్తినిచ్చిన మీలాంటి వారి జీవితాన్ని తెరకెక్కించాల్సిన అవసరం ఉందని ఆయనతో చెప్పాను. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. అన్ని హంగులతో త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నాం’ అన్నారు.