‘సందీప్కిషన్ ఇప్పటివరకూ సూపర్ నేచురల్ ఫాంటసీ జానర్ చేయలేదు. ఆయనకి ఈ కథ కచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది. విజువల్స్, సౌండ్ పరంగా ఆడియన్స్కు అద్బుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ‘ఊరు పేరు భైరవకోన’ అన్నారు దర్శకుడు వి.ఐ.ఆనంద్. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రధారులు. ఈ నెల 16న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వి.ఐ.ఆనంద్ విలేకరులతో ముచ్చటించారు. “డిస్కోరాజా’ తర్వాత రెండు కథలు రాసుకున్నాను. రెండూ సందీప్కిషన్కి చెప్పాను. ‘ఊరుపేరు భైరవకోన’ కథ విని తను చాలా ఎక్సయిట్ అయ్యాడు.
ట్రెండ్ సెట్చేసే కథ అవుతుందని సంబరపడిపోయాడు. కథను నమ్మి ఈ సినిమాతో నిర్మాతగా మారారు రాజేశ్ దండ’ అని తెలిపారు వి.ఐ.ఆనంద్. కర్మ సిద్ధాంతం, గరుడపురాణం, శివదండం లాంటి మైథలాజికల్ అంశాలతో కూడిన కథ ఇదని, అందుకే ‘ఊరుపేరు భైరవకోన’ అనే టైటిల్ని ఈ సినిమాకు పెట్టామని ఆయన అన్నారు.
ఖర్చు విషయంలో రాజీ పడకుండా, అలాగే వృథా చేయకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకొని ఈ సినిమా చేశామని, కంటెంట్, విజువల్ ఎక్స్పీరియన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని, యువతరంతోపాటు కుటుంబప్రేక్షకులకు కూడా కనెక్టయ్యే సినిమా ఇదని వి.ఐ.ఆనంద్ పేర్కొన్నారు. కథ, కథనాలతోపాటు సందీప్ నటన, వెన్నెల కిశోర్, వైవా హర్ష కామెడీ, కావ్యాథాపర్, వర్ష బొల్లమ్మ అందచందాలు ఈ సినిమాకు ప్రధాన బలాలని, సందీప్కి మంచి బ్రేక్ని ఇచ్చే సినిమా ఇదని, సాంకేతికంగా కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని వి.ఐ.ఆనంద్ చెప్పారు. నిఖిల్తో చేసే సినిమా చర్చల దశలో ఉందని, అలాగే ఓ పెద్ద హీరోకి కథ రాస్తున్నానని ఆయన తెలిపారు.