Tollywood Movies | రోహిణిలో రోకళ్లు పగిలే ఎండలు కాస్తే.. మృగశిరలో మంచి వర్షం పలకరిస్తుందని నమ్మకం. పక్కా ప్రణాళికతో వేసవిలో సినిమా విడుదల చేస్తే.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుందని సినీజనాల విశ్వాసం. కానీ, ఈసారి అకాల వర్షాలతో ఎండకాలం గతితప్పినట్టే.. భారీ అంచనాలతో విడుదలైన సినిమాలూ దారి తప్పాయి. వేసవిలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తాయనుకున్న చిత్రాలు ఉసూరుమనిపించాయి. ఒకట్రెండు మినహా మిగతావి చాలా నిరాశపరిచాయి. మరో మూడు వారాలు గడువు ఉండటంతో రాబోయే చిత్రాలపైనే అటు ఇండస్ట్రీ, ఇటు ప్రేక్షకులు.. ఉభయవర్గాలూ ఆశలు పెంచుకున్నాయి.
సాధారణంగా సంక్రాంతి, వినాయకచవితి పండుగ సీజన్ తర్వాత ఇండస్ట్రీ భారీగా ఆశలు పెట్టుకునేది వేసవిపైనే! అందుకు తగ్గట్టుగా సినిమా విడుదలకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు దర్శక, నిర్మాతలు. ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నా.. కథ బాగుంటేనే బాక్సాఫీస్కు బలం చేకూరుతుంది. ఈ వేసవి ప్రథమార్ధంలో విడుదలైనవాటిలో చాలా చిత్రాలు ఇలా ఉసూరుమన్నవే! భారీ అంచనాలతో విడుదలైన చిత్రాల ఫలితం మొదటి ఆటతోనే తారుమారు కావడంతో సాధారణ ప్రేక్షకుల వరకూ చేరలేకపోయాయి.
డిఫరెంట్ టేస్ట్ ఉన్న దర్శకుడిగా కృష్ణవంశీకి పేరుంది. ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలుగా నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం ‘రంగమార్తాండ’ మార్చి 22న ఘనంగా విడుదలైంది. అయితే, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం సాధారణ ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. మొదటి రోజు రిపోర్ట్ ఆశాజనకంగా రాకపోవడంతో ఓటీటీలో వచ్చాక చూడొచ్చులే అని ఫిక్సయ్యారు ప్రేక్షకులు. ఏప్రిల్ 7న ఓటీటీలో విడుదలైన ‘రంగమార్తాండ’ లెక్కకుమించి క్లిక్లు సొంతం చేసుకోవడం విశేషం.
విభిన్న చిత్రాల దర్శకుడు గుణశేఖర్ మహాకవి కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకాన్ని దృశ్యకావ్యంగా తెరకెక్కిస్తున్నాడని తెలిసినప్పటి నుంచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. శకుంతల పాత్రకు సమంతను ఎంచుకోవడంతో ఈ ప్రాజెక్టు అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రచారం కూడా బాగా కల్పించారు. వెండితెరపై ఓ అపురూప చిత్రంగా నిలుస్తుంది అనుకున్న ‘శాకుంతలం’ మొదటి ఆటతోనే తేలిపోయింది. వీకెండ్లోనూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది.
భారీ విజయం కోసం ఎదురుచూస్తున్న అక్కినేని వారసుడు అఖిల్కు మరోసారి భంగపాటు తప్పలేదు. ‘ఏజెంట్’ రూపంలో యాక్షన్ హీరోగా ప్రేక్షకులను అలరించాలని అనుకున్నాడు. కానీ, మరో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకోక తప్పలేదు. మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, మమ్ముట్టి వంటి భారీ నటుడు భుజం కాసినా ఏజెంట్ను బాక్సాఫీస్ ముందు నిలబెట్టలేకపోయారు.
ఈ నెలన్నర నిడివిలో చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. వీటిలో ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయినవే ఎక్కువ. రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రావణాసుర’ మాస్ ప్రేక్షకులను ఒప్పించలేకపోయింది. విశ్వక్సేన్ హీరోగా వచ్చిన ‘దాస్ కీ ధమ్కీ’ ఫ్లాప్టాక్ తెచ్చుకుంది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘మీటర్’ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించలేదు. మణిరత్నం మెగామూవీ ‘పొన్నియిన్ సెల్వన్-2’ తెలుగునాట పెద్దగా అలరించలేకపోయింది.
నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘దసరా’ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా వందకోట్ల జాబితాలో చేరడం విశేషం. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ‘దసరా’ డివైడ్ టాక్లోనూ ఓ మోస్తరు హిట్గా నిలిచింది. కానీ, ఇటీవల ఓటీటీలో విడుదలై సక్సెస్ఫుల్గా స్ట్రీమింగ్ అవుతున్నది. ఇప్పటివరకు జరిగిన సమ్మర్ రేస్లో సత్తా చాటిన చిత్రంగా నిలిచింది ‘విరూపాక్ష’. సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ రెండోవారం కూడా హౌస్ఫుల్ కలెక్షన్లు సాధిస్తూ వేసవి కలెక్షన్లకు ఊపిరులూదింది.
వేసవి ప్రథమార్ధం మామూలుగా సాగడంతో ద్వితీయార్ధం మీదే ఇండస్ట్రీ ఆశలు పెంచుకుంది. రానున్న మూడువారాలూ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, అరవిందస్వామి, కృతి శెట్టి తదితరులు నటించిన ‘కస్టడీ’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సునీల్, వెన్నెల కిషోర్ నటించిన ‘భువన విజయం’ చిత్రం కూడా అదే రోజు విడుదల కానుంది. సూపర్ హీరో కాన్సెప్ట్తో నిర్మించిన ‘హనుమ్యాన్’ చిత్రం కూడా మే 12నే రిలీజవుతున్నది. విభిన్న కథాంశాలను ఎంచుకునే శ్రీవిష్ణు తాజా చిత్రం ‘సామజవరగమన’ విడుదలకు సిద్ధంగా ఉంది. జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి, అనుష్క హీరోహీరోయిన్లుగా నిర్మించిన ‘మిస్ శెట్టి- మిస్టర్ పొలిశెట్టి’ చిత్రం ఈ నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతున్నది.