సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, మిత్రవిందా మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రియాంక దత్ నిర్మాత. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్రం నుంచి పెండ్లి విందు నేపథ్యంలో సాగే ‘చెయ్యి చెయ్యి కలిపేద్దాం..’ పాటను హైదరాబాద్లో విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ…‘నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత అల్లు అరవింద్, అశ్వనీదత్, రాఘవేంద్రరావు..ఈ ముగ్గురికి కథ చెప్పాను. అప్పటి నుంచి నాకు అన్ని మంచి శకునములే ఎదురయ్యాయి.’ అని చెప్పింది. నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ…‘నాకు మంచి మిత్రులైన అల్లు అరవింద్, రాఘవేంద్రరావుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. మేము కలిసి నిర్మించిన ‘పెళ్లిసందడి’ కోట్ల రూపాయల లాభాలు తెచ్చిపెట్టింది.
అలాగే హిందీలో రూపొందించిన ఒక సినిమా నష్టాలు తీసుకొచ్చింది. మాకు ఎదురైన ఫలితం ఎలా ఉన్నా సంతోషంగా స్వీకరించాం. స్నేహితులుగా కలిసే ఉన్నాం. వాళ్లు చేసిన చిత్రాలను చూసినప్పుడు గర్వపడుతుంటా’ అని చెప్పారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ…‘అశ్వనీదత్ బ్యానర్లో 14 చిత్రాలు రూపొందించాను. దాదాపు అన్నీ విజయాలు సాధించాయి. ఈ చిత్రంలోని పాట చూసినప్పుడు ‘పెళ్లిసందడి’లో నేను రూపొందించిన సాంగ్ గుర్తుకువచ్చింది. నందిని, స్వప్న, ప్రియాంక..ముగ్గురూ తెలివైన వారు. వాళ్లు కలిసి చేసిన ఈ సినిమా విజయం సాధించాలి’ అన్నారు.