Mahavatar Parshuraam | భారతీయ చలనచిత్ర రంగంలో యానిమేటెడ్ చిత్రాల సత్తాను చాటిన ‘మహావతార్ నరసింహ’ అఖండ విజయం తర్వాత, ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ నుంచి రెండో అడుగు పడింది. హోంబలే ఫిల్మ్స్ మరియు క్లీమ్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “మహావతార్ పరశురామ్” మోషన్ పోస్టర్ను నేడు పరశురామ జయంతి సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది.
కేవలం 40 కోట్ల బడ్జెట్తో రూపొంది, బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డు సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు అశ్విన్ కుమార్ విష్ణుమూర్తి దశావతారాల ఆధారంగా మొత్తం ఏడు చిత్రాలను ఈ యూనివర్స్లో భాగంగా రూపొందిస్తుండగా, రెండో చిత్రంగా పరశురాముడి కథను ఎంచుకున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లో యుద్ధ భూమిలో రక్తసిక్తమైన గొడ్డలిని ధరించి, రౌద్ర రూపంలో ఉన్న పరశురాముడిని చూపిస్తూ “ధర్మం పతనమైనప్పుడు పరశురాముడు ఉద్భవిస్తాడు.. ఆయన పాలకుడు కాదు, అధర్మాన్ని అంతమొందించే శక్తి” అని పేర్కొనడం విశేషం. సామ్ సి.ఎస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం అత్యాధునిక 3D యానిమేషన్ సాంకేతికతతో సిద్ధమవుతోంది. విజయ్ కిరగందూర్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళం మరియు మలయాళ భాషల్లో 2027 డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.