గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాశీ ఖన్నా నాయికగా నటిస్తున్నది. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమా జూలై 1న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ చిత్ర ప్రెస్మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ…‘యాక్షన్ కథల్లో ఎంటర్టైన్మెంట్ కలిస్తే అది ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది.
అలాంటి యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. మీరు పెట్టే టికెట్కు రెట్టింపు వినోదం పొందుతారు’ అని అన్నారు. రాశీఖన్నా మాట్లాడుతూ…‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో నేను చేసిన ఏంజెల్ ఆర్నా క్యారెక్టర్కు మంచే పేరొచ్చింది. ఈ సినిమాలో మిమ్మల్ని బాగా నవ్వించే పాత్రలో నటించాను. ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయాల్సిన చిత్రమిది’ అని చెప్పింది. ‘నా సినిమాల నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదం, గోపీచంద్ చిత్రాల్లోని యాక్షన్ కలిపి ఉన్న సినిమా ఇది.
నూరుశాతం వినోదాన్ని అందిస్తుందని చెప్పగలను’ అని దర్శకుడు మారుతి అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ…‘మారుతి డైరెక్ట్ చేసిన సినిమాలు థియేటర్లోనే చూడాలి. ఒంటరిగా చూస్తే ఎంజాయ్ చేయలేం. ఆయన సినిమాలు ఆహ్లాదకరంగా నవ్విస్తూనే ఒక చిన్న సందేశాన్ని కూడా ఇస్తాయి. గోపీచంద్లో ఉన్న హ్యూమర్ యాంగిల్ను మారుతి బాగా చూపించాడు. నిర్మాతలు ఈ మధ్య త్వరగా సినిమాలను ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ఇది మనకే చేటు చేస్తుంది.
మా సినిమాను మాత్రం ఇప్పుడప్పుడే ఓటీటీలో విడుదల చేయడంలేదు’ అన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ..‘మారుతి దర్శకత్వంలో తొలిసారి నటిస్తున్నా. ఈ కథలోనే కామెడీకి చాలా అవకాశం ఉంది. అది నేను పర్మార్మ్ చేయగలిగితే చాలు అనుకున్నా. రాశీ ఖన్నా క్యారెక్టర్ హిలేరియస్గా ఉంటుంది. ఒక మంచి టీమ్ ఉన్నప్పుడు సగం విజయం సాధించినట్లే అనిపించింది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు అజయ్ ఘోష్, ఎస్కేఎన్ తదితరులు పాల్గొన్నారు.