అనుష్కది పద్దెనిమిదేళ్ల జర్నీ. ఆమె గ్లామర్లాగే క్రేజ్ కూడా ఇసుమంత కూడా తగ్గలేదు. ‘జాతిరత్నాలు’ ఫేం నవీన్ పొలిశెట్టితో కలిసి ఆమె నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలివి..
ఎవరికైనా కనెక్టయ్యే పాయింట్ ఇది
నా కెరీర్లో చాలా సినిమాలు చేశాను. నిర్మాణం సమయంలో ఏ సినిమా ఇవ్వని అనుభూతి ‘మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి’ ఇచ్చింది. నిజంగా ఇది స్వీట్ జర్నీ. దర్శకుడు మహేశ్ అందరికీ నచ్చే కథ తయారు చేసుకున్నాడు. ఎవరికైనా కనెక్టయ్యే పాయింట్ ఇది. ఇక నవీన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పని విషయంలో చాలా సిన్సియర్. దానికితోడు ఆయనలో సెన్సాఫ్హ్యూమర్ ఎక్కువ. తన హ్యూమర్తో సాటి ఆర్టిస్టులకు కష్టం తెలియకుండా మాయ చేస్తాడు.
ఆ పాత్ర తను తప్ప మరొకరు చేయలేరు
ఆర్టిస్టుగా నవీన్ కంటే నేను సీనియర్నే కావొచ్చు. కానీ ప్రేక్షకులకు ఆ ఫీలింగ్ అనిపించదు. మా ఇద్దరి కెమిస్ట్రీ అలా వర్కవుటయింది. నిజానిక్కూడా ఆ ఫీలింగ్ ఉంటే ఫ్రీగా చెయ్యలేం. ఇక్కడ పాత్రలే ముఖ్యం.. ఎవరు చిన్న? ఎవరు పెద్ద? అనే భేషజాలకు తావివ్వకుండా కలిసిపోయి నటించాం. అందుకే అవుట్పుట్ అంత బాగా వచ్చింది. ముఖ్యంగా నవీన్ గొప్ప నటుడు. ఈ పాత్ర తను తప్ప మరొకరు చేయలేరు. వ్యక్తిగతంగా వెరీ నైస్ పర్సన్. తనతో మళ్లీ కలిసి నటించాలనుంది.
విప్లవ భావాలు కలిగిన అమ్మాయి
అన్విత, సిద్ధూ అనే ఇద్దరి ప్రయాణం ఈ సినిమా. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్. అసలు ప్రెగ్నెన్సీకి పెళ్లికి ఏమిటి సంబంధం? ఇద్దరు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. దానికి పెళ్లి అవసరమా? అమ్మ అవ్వాలంటే పెళ్లి కంపల్సరా? అని ప్రశ్నించే విప్లవభావాలు కలిగిన అమ్మాయి అన్విత. అలాంటి అమ్మాయికి సిద్ధూ అనే అబ్బాయికి మధ్య సాగే సరదా కథాంశమిది. కథనం కూడా కొత్తగా ఉంటుంది. ఎమోషన్స్ లైటర్వేలో ఉంటాయి. హ్యూమర్ మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. సగటు ప్రేక్షకులకు కావాల్సిన అన్నీ ఇందులో కనిపిస్తాయి. దర్శకుడు మహేశ్ ఈ సినిమాతో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించుకుంటాడు.
ఇండియన్ స్క్రీన్మీద రాని థ్రిల్లర్
ఈ సినిమా తర్వాత ‘కథనార్’ అనే మలయాళం సినిమా చేయబోతున్నాను. దర్శకుడు రోజిన్ థామస్ ఏడు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్కే రెండేళ్లు పట్టింది. అంత ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఇది. జయసూర్య కథానాయకుడు. ఇదొక ఫాంటసీ మేజిక్. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మెండుగా ఉంటాయ్. ఇందులో నా పాత్రను రివీల్ చేయదలుచుకోలేదు. చాలామంది ఘోస్ట్గా చేస్తున్నానుకుంటున్నారు. అందులో నిజంలేదు. ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్మీద రాని థ్రిల్లర్ ఇది. ఇక తెలుగు విషయానికొస్తే.. ప్రస్తుతం కథలు వినే పనిలోవున్నాను. ‘బెంగళూరు నాగరత్నమ్మ’ బయోపిక్కి సంబంధించిన స్క్రిప్ట్ ఒక వెర్షన్ విన్నాను. మళ్లీ వినాలి.
నా జర్నీ చూస్తే నాకే ఆశ్చర్యమేస్తుంది
నా తొలి సినిమా ‘సూపర్’ నుంచి ఇప్పటివరకూ నటిగా నా జర్నీ చూస్తే నాకే ఆశ్చర్యమేస్తుంది. నేను బోర్న్ ఆర్టిస్ట్కాదు. కానీ నా జర్నీనే నన్ను నటిగా నిలబెట్టింది. ఈ విషయంలో నా దర్శకులందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా గత చిత్రం ‘నిశ్శబ్దం’ మంచి ప్రయోగం. అసలు మొదటైతే డైలాగ్ లేకుండా ఆ సినిమా చేయాలనుకున్నాం. కానీ కొన్ని కారణాలవల్ల మార్పులు జరిగాయి. నటిగా ఇంకా ప్రయోగాలు చేయాలనుంది. ఇక నా పెళ్లి విషయానికొస్తే.. మీడియాలో నాకే తెలియని వార్తలు వింటున్నాను. నిజంగా చేసుకోవాలనుకుంటే ముందు మీతోనే చెబుతాను.