నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకుడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 29న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘ఇటీవలే విడుదలైన టీజర్కు అద్భుతమైన స్పందన లభించింది. కోపాన్ని ఓ క్రమపద్ధతిలో వాడుకునే వ్యక్తిగా ఇందులో నాని కనిపిస్తారు. శనివారాల్లో మాత్రమే శత్రువులను వేటాడే పవర్ఫుల్ పాత్ర ఇందులో ఆయనది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్.జె.సూర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మురళి.జి, సంగీతం: జేక్స్ బిజోయ్, రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ.