ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మూడు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుతాం. తనదైన శైలి కళాత్మక, వాణిజ్య అంశాల కలబోతగా శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు.
వివిధ భాషలకు చెందిన అగ్రశ్రేణి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగమవుతారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సోనాలి నారంగ్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.