The Kerala Story | సాధారణంగా థియేటర్లలో రిలీజైన సినిమాలు ఒకటి, రెండు నెలల్లోనే ఓటీటీలోకి (OTT) వచ్చేస్తున్నాయి. అయితే కొన్ని సినిమా మాత్రం నెలలు గడిచినా రావడంలేదు. అలాంటివాటిలో అదా శర్మ నటించిన ‘ది కేరళ స్టోరీ’ (Ther Kerala Story) కూడా ఒకటి. అనేక వివాదాల మధ్య గతేడాది మే 5న ఈ సినిమా టాకీసుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది.
లవ్ జిహాద్ నేపథ్యంలో రూ.35 కేట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విధంగా రూ.244.8 కోట్ల మేర రాబట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం చక్కర్లు కొడుతున్నది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఓటీటీలోకి విడుదల కానుందనే ఆ వార్త.. అయితే స్ట్రీమింగ్ ఎప్పుడనేది స్పష్టత రాలేదు. జనవరి 14న లేదా 17న ఓటీటీలోకి సందడి చేయనుందని తెలుస్తున్నది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 ప్రసార హక్కులను సొంతం చేసుకున్నది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉండనుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై అటు ఓటీటీ సంస్థ కానీ, చిత్ర నిర్మాతలు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో అదా శర్మతోపాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.