Ada Sharma | ‘ది కేరళ స్టోరీ’లో కీలక పాత్ర పోషించిన నటి అదా శర్మ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ముంబయిలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో చిత్రబృందం వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అదాశర్మతో పాటు గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించారు. ప్రమాదంలో అందరూ స్వల్పగాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. యాక్సిడెంట్ గురించి వార్త తెలియడంతో అభిమానులంతా షాక్కు గురయ్యారు. ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా అదాశర్మ స్పందించింది. తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని, ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొంది. తనతో పాటు చిత్రబృందం అంతా బాగానే ఉన్నారని తెలిపింది.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డానని తెలియడంతో చాలా మంది నా యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకుంటున్నారని, చాలా మెసేజ్లు వస్తున్నాయని పేర్కొంది. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు చెప్పింది. ఇదిలా ఉండగా.. ‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదం కొనసాగుతున్నది. ఈ చిత్రంలో నటించిన అదా శర్మతో పాటు పలువురికి బెదిరింపులు వచ్చాయి. కేరళలో జరిగిన ముగ్గురు యువతుల యదార్థ కథను సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమాపై రాజకీయ పార్టీలు, వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చిత్రం వాస్తవాల ఆధారంగా తీసింది కాదని, ముస్లిం సమాజంపై ద్వేషాన్ని పెంచుతుందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ సినిమాని బ్యాన్ చేయాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్నది.