Cinematograph Bill 2023 | సినీ మాధ్యమంలో సృజనాత్మక వ్యక్తీకరణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ చట్టం పరిధుల మేరకు మాత్రమే ఉండాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం 1952లో సినిమాటోగ్రఫీ చట్టానికి రూపకల్పన చేసింది. అయితే ఈ 70 ఏండ్ల కాలంలో సినీరంగం అనేక మార్పులకు లోనయింది. అధునాతన సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల సినిమా ప్రదర్శనకు భిన్న మాధ్యమాలు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ బిల్లును సవరించాలని ఎన్నో ఏండ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవల కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు-2023ను రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. సోమవారం ఈ బిల్లు లోక్సభ ఆమోదం కూడా పొందింది. పైరసీ నియంత్రణతో పాటు సెన్సార్ సర్టిఫికెట్స్ను మరిన్ని ఉప విభాగాలుగా విభజిస్తూ తాజా బిల్లులో అనేక నిబంధనలను పొందుపరిచారు.
సోమవారం లోక్సభ ఆమోదించిన ఈ బిల్లు మొదటి వెర్షన్ను 2019లో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయితే ఇందులో పైరసీ సమస్యను పరిష్కరించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. అనంతరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీ పలు సూచనలు, కొత్త నిబంధనలతో 16 మార్చి 2020న ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఈ క్రమంలో ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి ముసాయిదాను రూపొందించడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టింది. విస్తృత అభిప్రాయ సేకరణ నిమిత్తం స్టాండింగ్ కమిటీ వివిధ రాజకీయపక్షాలు, సినీ వాటాదారులతో అనేక దఫాలుగా సంప్రదింపులు జరిపింది. ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. అన్ని పక్షాల నుంచి తీసుకున్న సమాచారంతో పాటు సినిమాటోగ్రఫీ చట్టానికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా అధ్యయనం చేసి సినిమాటోగ్రఫీ బిల్లు-2023 తుది వెర్షన్ను సిద్ధం చేశారు. గత వారం రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లు తాజాగా లోక్సభలో సైతం పాస్ అయింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టంగా మారనుంది.
పరిశ్రమను రెండు దశాబ్దాలుగా వెంటాడుతున్న పైరసీ భూతంపై ఉక్కుపాదం మోపేందుకు తాజా బిల్లులో కఠినమైన నిబంధనలను పొందుపరిచారు. తాజా సవరింపుల ప్రకారం సినిమాలను అనధికారికంగా రికార్డ్ చేయడం, అనుమతి లేకుండా బహిరంగంగా ప్రదర్శించడం, ఆన్లైన్లో..సాంఘిక మాధ్యమాల్లో షేర్ చేయడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఈ నిబంధనలను ఉల్లఘించిన వారికి మూడు నెలల నుంచి మూడేండ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. దీనితో పాటు సినిమా నిర్మాణ వ్యయంలో ఐదు శాతాన్ని నిందితులు జరిమానాగా కట్టాల్సి ఉంటుంది. సినిమాకు సంబంధించిన కొద్ది భాగాన్ని కూడా పైరసీ చేయడం శిక్షార్హమని కొత్త నిబంధనలో పేర్కొన్నారు.
సెన్సార్ సర్టిఫికేషన్లో ఇప్పటివరకు ‘యూ’ ‘యూ.ఏ’ ‘ఏ’ ‘యస్’ కేటగిరీలు మాత్రమే ఉండేవి. తాజా బిల్లులో యూ.ఏ (తల్లిదండ్రుల పర్యవేక్షణలో 12లోపు పిల్లలు చూసే చిత్రాలు) విభాగంలో ఉప విభాగాలను చేర్చారు. పిల్లల వయసు ఆధారంగా యూ. ఏ7ప్లస్, యూ.ఏ13ప్లస్, యూ.ఏ16ప్లస్గా వర్గీకరణ చేశారు. ఈ కేటగిరీ చిత్రాలను కేవలం తల్లిదండ్రుల సమక్షంలో మాత్రమే పిల్లలు చూడాలని బిల్లులో పేర్కొన్నారు. ఇక టీవీల్లో ప్రదర్శితమయ్యే సినిమాల విషయంలో తాజా బిల్లులో సరికొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. సినిమాల ప్రదర్శనలో టీవీతో పాటు ఇతర ప్రసార మాధ్యమాల కోసం ప్రత్యేకంగా సర్టిఫికెట్ను జారీ చేసే అధికారాన్ని సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్)కు కట్టబెడుతూ నిబంధనలు సవరించారు. ‘ఏ’ సెన్సార్ సర్టిఫికెట్ పొందిన చిత్రాలను టీవీల్లో ప్రదర్శించకూడదని 2007లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఎన్నో చిత్రాలు టీవీల్లో ప్రదర్శనకు అవకాశాన్ని కోల్పోయాయి. ఇప్పుడీ చట్టాన్ని సవరించారు. దీని ప్రకారం ఏ, యస్ సర్టిఫికెట్స్ పొందిన సినిమాలు టీవీ మాధ్యమంలో ప్రదర్శించాలంటే సెన్సార్ బోర్డ్ నుంచి కొత్తగా పునః ధృవీకరణ పత్రాలను పొందవలసి ఉంటుంది. కంటెంట్ విషయంలో సెన్సార్ సూచించిన మార్పులను విధిగా పాటిస్తేనే ఆ సినిమాలను టీవీ ప్రదర్శనకు అనుమతిస్తారు.
1952 సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం సెన్సార్ బోర్డ్ జారీ చేసే ధృవీకరణ పత్రం కేవలం పదేళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. తాజా సవరణలో దీనిని జీవితకాలం చెల్లుబాటు అయ్యే విధంగా నిబంధనల్లో మార్పులు చేశారు. సెన్సార్ బోర్డ్పై కేంద్ర ప్రభుత్వ నియంత్రను పూర్తిగా తొలగించడం ఈ బిల్లులో ప్రధాన సవరణగా చెబుతున్నారు. గతంలో సినిమాలపై వివాదాలు చెలరేగి, ఓ వర్గం నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన సందర్భాల్లో కేంద్రం రీ సెన్సారింగ్కు ఆదేశించే వెసులుబాటు ఉండేది. అయితే రాజకీయ కారణాలతో రీ సెన్సారింగ్ దుర్వినియోగం అవుతున్నదని విమర్శలొస్తు న్నాయి. ఈ నేపథ్యంలో రీ సెన్సారింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను పూర్తిగా తొలగిస్తూ తాజా బిల్లులో సవరణలు చేశారు.
భవిష్యత్తులో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే కంటెంట్ విషయంలో ఆంక్షలు విధించే అవకాశం ఉందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఓటీటీలు స్వీయ నియంత్రణ పాటిస్తూ కంటెంట్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు.