నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. నారాయణదాస్ కె నారంగ్, పూస్కుర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా దసరా పండక్కి రేపు విడుదలవుతున్నది. ఈ సందర్భంగా సోమవారం నిర్మాతలు పూస్కూర్ రామ్మోహన్ రావు, సునీల్ నారంగ్ చిత్ర విశేషాలు తెలిపారు. పూస్కూర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ…“శివ’ తర్వాత నాగార్జున గారు నటించిన యాక్షన్ చిత్రమిది. అదే రోజున ఈ సినిమా కూడా విడుదలవడం సెంటిమెంట్గా భావిస్తున్నాం. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి.
మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నాం. నాకు డిస్ట్రిబ్యూటర్గా 300 సినిమాలు విడుదల చేసిన అనుభవం ఉంది. ఏషియన్ సంస్థలో 500లకు పైగా చిత్రాలను విడుదల చేశారు. పండగ సమయంలో రెండు మూడు పెద్ద సినిమాలైనా విడుదల చేసుకోవచ్చు. సెలవులు ఉంటాయి కాబట్టి ప్రేక్షకులకు చూసే వీలుంటుంది. పాండమిక్ వల్ల ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే పెరిగింది. హీరోల స్టార్డమ్ను బట్టే పారితోషికాలు చెల్లిస్తుంటాం. వాళ్ల క్రేజ్ను బట్టి కోటి నుంచి వంద కోట్ల రూపాయల వరకు హీరోలకు నిర్మాతలం ఇస్తుంటాం’ అన్నారు.
నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ..‘నాగార్జున గారితో సినిమా చేయాలనేది నాన్నగారి ఆలోచన. ఆయనపై గౌరవంతో నాగార్జున గారు ఈ సినిమా చేశారు. ఆయన కెరీర్లో బిగ్ బడ్జెట్ చిత్రమిది. తెలుగు, తమిళంలో దసరా పండగ రోజు విడుదల చేస్తున్నాం. హిందీలో రెండు రోజుల తర్వాత రిలీజ్ చేస్తాం. పాన్ ఇండియా రిలీజ్ చేయాల్సిన సినిమా ఇది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల నార్త్లో రిలీజ్ చేయడం రెండు రోజులు ఆలస్యమవుతోంది. మధ్య తరగతి ప్రేక్షకులే సినిమాలను ఎక్కువగా ఆదరిస్తారు. వాళ్లకు అందుబాటులో టికెట్ రేట్లు ఉండాలి. మా సినిమాకు సాధారణ టికెట్ రేట్లే ఉంటాయి’ అన్నారు.