సుధీర్బాబు హీరోగా, రచయిత హర్షవర్దన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. సునీల్ నారంగ్, పున్కూర్ రామ్మోహన్రావు నిర్మాతలు. అక్టోబర్ 6న విడుదల కానున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ని ప్రముఖ హీరో మహేశ్బాబు విడుదల చేశారు. సుధీర్బాబు మాట్లాడుతూ‘ కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమా ఇది. ఇందులో నాది ట్రిపుల్ రోల్. పరశురాం, దుర్గా, డిజేగా కనిపిస్తా. నా చిన్నప్పుడు పాత్రను మా అబ్బాయి చేశాడు.
ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. పరశురాం పాత్ర కోసం బరువు పెరిగాను. లావుగా వున్న దుర్గా పాత్రకోసం ప్రోస్తటిక్స్ వాడాం. డిజే పాత్రలో మాత్రం నేను నాలా ఉంటాను’ అన్నారు. “ ‘మనం’తో రచయితగా మీ అభిమానం పొందాను. ఈకథలోని ప్రతి మలుపూ ఆశ్చర్యానికి లోను చేస్తుంది. నన్ను ప్రోత్సహించిన నిర్మాతలకు, హీరో సుధీర్బాబుకీ థ్యాంక్స్’ అని హర్షవర్దన్ అన్నారు. ఇంకా నిర్మాత పున్సుర్ రామ్మోహన్ కూడా మాట్లాడారు.