Rishab Shetty | గోవాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫి) వేడుకలో ‘కాంతార’ చిత్రానికి సిల్వర్ పీకాక్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, హీరో రిషబ్శెట్టి ఇచ్చిన ప్రసంగం చర్చనీయాంశంగా మారింది. “కాంతార’ చిత్రానికి తొలుత కన్నడ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఆదరణ దక్కింది. సినిమా ఈ స్థాయిలో విజయం సాధించడానికి కన్నడ ప్రేక్షకులే కారణం. నేను వారికి రుణపడి ఉంటాను.
ఒక సినిమా సూపర్హిట్ కాగానే కన్నడ ఇండస్ట్రీ వదిలి వేరే భాషల్లోకి వెళ్లను. నేను అలాంటి వ్యక్తిని కాను’ అంటూ రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అగ్ర కథానాయిక రష్మిక మందన్నను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. రష్మిక తన తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ’ తర్వాత కన్నడ ఇండస్ట్రీని వదిలి తెలుగు, హిందీపై దృష్టి పెట్టిందని, రిషబ్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా ఆమెను ఉద్దేశించినవేనని నెటిజన్లు కామెంట్స్ చేశారు.
అయితే ఓ అభిమాని మాత్రం రిషబ్శెట్టి ఎవరినీ ఉద్దేశించి ఆ మాటలు అనలేదని, కన్నడ పరిశ్రమను వదిలివెళ్లనని మాత్రమే చెప్పారని కామెంట్ చేశాడు. దీనికి రిషబ్శెట్టి స్పందిస్తూ ‘చాలా మంది నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నువ్వొక్కడివే నిజాన్ని తెలుసుకున్నావు’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్మీడియాలో వైరల్గా మారింది. రిషబ్శెట్టి ప్రస్తుతం ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు.