‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇటీవల జపాన్లో విడుదలైన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకుల్ని కూడా మెప్పించింది. ప్రస్తుతం ఆ సినిమా ఆస్కార్ పురస్కారాల్లో జనరల్ కేటగిరిలో పోటీలో దిగబోతున్నది. ఈ సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాలో ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ గురించి రాజమౌళి ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు.
కథానాయకుడు ఎన్టీఆర్ క్రూర మృగాల సహాయంతో బ్రిటీష్ బంగ్లాపై దాడి చేసిన సందర్భంలో వచ్చే పోరాట ఘట్టాలు సినిమాకు ప్రధానాకర్షణగా నిలిచాయి. ఈ ఫైట్ సీక్వెన్స్ గురించి రాజమౌళి మాట్లాడుతూ ‘దాదాపు నలభై రాత్రుల పాటు ఆ ఎపిసోడ్ షూటింగ్ చేశాం. అడవి జంతువులను త్రీడీ యానిమేషన్లో చూపించాల్సి రావడంతో చాలా శ్రమపడ్డాం. ఒక్కో జంతువు పరిగెత్తే వేగం వేరుగా ఉంటుంది.
పులి గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు. దాని వేగాన్ని అంచనా వేస్తూ కెమెరాను ఉపయోగించాల్సి వచ్చేది. రిమోట్ కంట్రోల్ కార్లకు జెండాలు కట్టి వాటి మీద జంతువుల గుర్తులను ముద్రించాం. వాటివల్ల ఫైట్ చేస్తున్నప్పుడు తమ పక్కన ఏ జంతువు పరుగెడుతుందో, ఆ సందర్భంలో పండించాల్సిన ఎమోషన్ ఏమిటో ఆర్టిస్టులు తెలుసుకునేవారు. యాక్షన్, ఎమోషన్ సమపాళ్లలో మేళవించిన ఈ ఫైట్ సీక్వెన్స్ చేయడం గొప్ప అనుభవంగా మిగిలిపోయింది’ అని చెప్పారు.