‘జెర్సీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది శ్రద్ధా శ్రీనాథ్. భావోద్వేగభరితమైన పాత్రలో చక్కటి నటనతో అందరిని మెప్పించింది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఈ భామకు ఆశించిన అవకాశాలు రాలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సొగసరి తెలుగులో మరో భారీ ఆఫర్ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళితే…వెంకటేష్ కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మాఫియా బ్యాక్డ్రాప్లో రూపొందిస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రంలో రుహానీ శర్మ కథానాయికగా నటిస్తున్నది. కథానుగుణంగా ఈ సినిమాలో రెండో నాయికకు కూడా చోటుందట. ఇందుకోసం శ్రీనాథ్ను సంప్రదించగా ఆమె అంగీకరించిందని తెలిసింది. త్వరలో ఈ భామ సినిమా సెట్స్లో జాయిన్ కానుందని సమాచారం.