అనువాద చిత్రాల మాటల రచయిత శ్రీరామకృష్ణ(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే రామకృష్ణను చెన్నయ్ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. దాదాపు 300 పై చిలుకు సినిమాలకు శ్రీరామకృష్ణ మాటల రాశారు. అందులో ఎన్నో విజయవంతమైన అనువాద చిత్రాలు ఉన్నాయి. శ్రీరామకృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి.
50ఏళ్ల క్రితమే సినిమామీద మక్కువతో చెన్నయ్లో సెటిల్ అయ్యారాయన. శంకర్ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్మెన్, జీన్స్, అపరిచితుడు, ఒకేఒక్కడు చిత్రాలకు తెలుగు వెర్షన్ డైలాగులు శ్రీరామకృష్ణవే. అలాగే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఎన్నో చిత్రాలకు ఆయన తెలుగు వెర్షన్ డైలాగులు రాశారు. డబ్బింగ్ అనే ఫీల్ రానివ్వకుండా డైలాగులు రాయడం శ్రీరామకృష్ణ ప్రత్యేకత. రజనీకాంత్, కమల్హాసన్, మమ్ముట్టి, మోహన్లాల్, విక్రమ్, అజిత్ ఇలా హీరోలందరి డబ్బింగ్ సినిమాలకూ తెలుగు వెర్షన్ డైలాగులు రాసిన క్రెడిట్ శ్రీరామకృష్ణది. ఆయన గీత రచయిత, దర్శకుడు కూడా. బాలమురళి ఎం.ఎ., సమాజంలో స్త్రీ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. శ్రీరామకృష్ణ మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. మంగళవారం సాయంత్రం చెన్నయ్లో ఆయన అంత్యక్రియలు జరిగాయి.