సినీ దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరరావు(56) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. స్వగ్రామం పాలకొల్లు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఫిట్స్ రావడంతో ఆయన మృతిచెందారు. కోడి రామకృష్ణ శిష్యుడిగా సినీరంగ ప్రవేశం చేసిన కె.ఎస్.నాగేశ్వరరావు ‘రిక్షారుద్రయ్య’ సినిమాతో దర్శకుడిగా మారారు. దివంగత నటుడు శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ ఆయన తెరకెక్కించిన ‘పోలీస్’ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సక్సెస్ ఇచ్చిన స్ఫూర్తితో శ్రీహరితో ‘శ్రీశైలం’, ‘సాంబయ్య’ సినిమాల్ని రూపొందించారు. ఇన్స్పెక్టర్, వైజయంతి, రా, శివన్న, వార్నింగ్ సినిమాలు దర్శకుడిగా కె.ఎస్. నాగేశ్వరరావుకు మంచి పేరుతెచ్చాయి. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘బిచ్చగాడా మజాకా’ 2019లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.