తెలుగు చిత్ర పరిశ్రమ మరో సీనియర్ నటుడిని కోల్పోయింది. దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారుజామున 4గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 87 ఏండ్లు. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గత కొంతకాలంగా కైకాల సత్యనారాయణ వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకుంటున్నారు. గతేడాదే ఆయన ఆరోగ్యం విషమించింది. మళ్లీ కోలుకొని ఇంటివద్దే చికిత్స తీసుకుంటున్నారు. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు శనివారం ఉదయం జూబ్ల్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరుగనున్నాయి.
నీటిని ఏ పాత్రలో పోస్తే దాని రూపాన్ని సంతరించుకున్నట్లే.. కైకాల సత్యనారాయణ ఏ పాత్ర పోషించినా అందులోకి పరకాయ ప్రవేశం చేస్తారు. ఎటువంటి నాటకీయత, కృత్రిమత్వం లేకుండా ఆయన పాత్రల్లో జీవం తొణికిసలాడుతుంది. నవరసాల్ని నవనవోన్మేషితంగా వెండితెరపై పలికించారు కాబట్టే ఆయన్ని తెలుగు ప్రజానీకం ‘నవరస నటనా సార్వభౌమ’ అనే బిరుదుతో గౌరవించుకుంది. యస్వీఆర్ తర్వాత వెండితెరపై అంతటి సహజ అభినయశీలిగా పేరు పొందారు కైకాల. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రక చిత్రాల్లో అద్వితీయ నటనతో తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ అపూర్వమైన అధ్యాయాన్ని లిఖించుకున్నారు. గంభీరమైన వాచకం, మాటల్ని తూటాల్లా పేల్చే నేర్పు, రాజసం కలబోసిన గాంభీర్యం ఆయనకు నాటి అగ్ర కథానాయకులతో సమానమైన ఇమేజ్ను తెచ్చిపెట్టింది. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో బహుముఖప్రజ్ఞాశాలిగా వెలుగొందారు కైకాల. పౌరాణిక చిత్రాల్లో ఆయన అభినయం నభూతో నభవిష్యతి. దుర్యోధనుడు, యముడు, కర్ణుడు, రావణాసురుడిగా పౌరాణిక పాత్రలకు నూతన జవజీవాల్ని అందించారు. కైకాల నిష్క్రమణంతో తెలుగు సినీ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయానికి తెరపడింది.
తెలుగు సినీరంగంలో యస్వీరంగారావు తర్వాత ఆ స్థాయిలో పేరు సంపాదించుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కైకాల సత్యనారాయణను అభివర్ణిస్తారు. యస్వీ రంగారావు పాత్రలపరంగా ప్రదర్శించిన వైవిధ్యం, విలక్షణత అంతా సత్యనారాయణ పాత్రల్లో కూడా కనిపిస్తుందన్నది విశ్లేషకుల మాట. విలన్ వేషంలో అత్యంత క్రూరత్వాన్ని ప్రదర్శించడం, సాత్విక పాత్రల్లో హృదయాల్ని కదిలించే అభినయం, హాస్య పాత్రలో గిలిగింతలు పెట్టించే నేర్పు సత్యనారాయణ సొంతం అని చెప్పొచ్చు. నవరసాల్ని తన అభినయంలో అలవోకగా పలికించే అసాధారణ ప్రతిభాశీలి కాబట్టే ప్రేక్షకులు ఆయన్ని ‘నవరస నటసార్వభౌమ’ అనే బిరుదుతో పిలుచుకున్నారు.
ఎన్టీఆర్ కృష్ణుడిగా నటించిన ‘కృష్ణావతారం’ చిత్రంలో దుర్యోధనుడి పాత్రను పోషించే అవకాశం కైకాల సత్యనారాయణకు దక్కింది. ఆ సినిమా తర్వాత వరుసగా ఆయన్ని దుర్యోధనుడి పాత్రలు వరించాయి. ఈ ప్రయాణంలో దుష్టపాత్రలకు చిరునామాగా భాసిల్లారు కైకాల. జానపదబ్రహ్మ విఠలాచార్య ప్రోత్సాహంతో సత్యనారాయణ ప్రతినాయకుడి పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు. ‘నర్తనశాల’లో దుశ్శాసనుడిగా, ‘కురుక్షేత్రం’లో సుయోధనుడిగా, ‘సీతా కల్యాణం’లో రావణాసురుడిగా, ‘చాణక్య చంద్రగుప్త’లో రాక్షసమంత్రిగా అద్భుతాభినయంతో మెప్పించారు. ప్రతినాయకుడి పాత్రలతో పాటు ‘స్వర్ణగౌరి’ చిత్రంలో శివుడి పాత్రలో ఆకట్టుకున్నారు. ‘మదన కామరాజు కథ’లో ధర్మపాలుడిగా, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో కర్ణుడిగా, ‘దాన వీర శూరకర్ణ’లో భీమునిగా, ‘లవకుశ’లో భరతుడిగా మెప్పించారు. విఠలాచార్య రూపొందించిన ‘అగ్గిపిడుగు’ చిత్రంలో రాజనాల సహచరుడిగా, ‘శ్రీకృష్ణపాండవీయం’ ‘పాండవ వనవాసం’ చిత్రాల్లో ఘటోత్కచుడిగా అసమాన నటనతో ఆకట్టుకున్నారు. యస్వీఆర్ తర్వాత ఘటోత్కచుడి పాత్రను రక్తికట్టించింది సత్యనారాయణే అని చెబుతారు. యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ‘ఘటోత్కచుడు’ చిత్రంలో కైకాల టైటిల్ రోల్ను పోషించి అలరించారు.
ఎన్టీఆర్ నిర్మించి, నటించిన ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రం సత్యనారాయణను సాత్వికాభినయంలో ఆవిష్కరించి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో ఎన్టీఆర్తో సమానంగా కైకాలకు గుర్తింపుదక్కింది. ఇందులో ఎన్టీఆర్ రెండో అన్నయ్యగా ప్రథమార్థంలో సౌమ్యమైన నటనతో, ద్వితీయార్థంలో విషాదభరిత వదనంతో తన పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. అప్పటివరకు దుష్టపాత్రలకు ప్రసిద్ధి పొందిన సత్యనారాయణ ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రం ద్వారా ఏ పాత్రకైనా న్యాయం చేయగలడనే పేరు సంపాదించుకున్నారు. కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శారద’ చిత్రంలో చెల్లెలి జీవితంలోని విషాదంతో తల్లడిల్లే అన్నగా ఆయన అభినయం చిరస్థాయిగా నిలిచిపోయింది. కథానాయకుడు, ప్రతినాయకుడు, హాస్యనటుడు..తండ్రిగా, కుమారుడిగా, సోదరుడిగా, తాతగా..ఇలా పాత్ర ఏదైనా అందులో పరకాయప్రవేశం చేసేవారు సత్యనారాయణ. తెలుగులో నాటి ఎన్టీఆర్ మొదలుకొని నేటి బాలకృష్ణ వరకు అగ్ర కథానాయకులందరి సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించారాయన. ‘అగ్నిపర్వతం’ ‘బొబ్బిలి బ్రహ్మన్న’ ‘అన్వేషణ’ ‘ప్రేమించు పెళ్లాడు’ చిత్రంలో కైకాల చేసిన హాస్యపాత్రలు చక్కటి నవ్వుల్ని పంచాయి.
‘తాత మనవడు’ ‘సంసారం సాగరం’ ‘కచదేవయాని’ చిత్రాలకు ఉత్తమ నటుడిగా నాటి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు అందుకున్నారు కైకాల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డును స్వీకరించారు. 1996లో మచిలీపట్నం నుంచి లోక్సభ సభ్యుడిగా గెలుపొందారు.
తెలుగు తెరపై యముడు అనగానే తొలుత స్ఫురణకు వచ్చే రూపం సత్యనారాయణదే అంటే అతిశయోక్తి కాదు. ఎన్నో సినిమాల్లో యముడి పాత్రలకు ప్రాణం పోశారాయన. 1977లో ఎన్టీఆర్ హీరోగా తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన ‘యమగోల’ సినిమాలో తొలిసారి యముడి పాత్రను పోషించారు. ఇందులో సత్యనారాయణ ‘యముండా..’ అంటూ చెప్పిన డైలాగ్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. యముడికి మొగుడు, యమలీల, దరువు, యమజాతకుడు, యమగోల మళ్లీ మొదలైంది సినిమాల్లో యముడిగా సత్యనారాయణ అసమాన నటనను కనబరిచి మెప్పించారు. యముడి పాత్రల్లో అంతకుముందు ఎన్టీఆర్, యస్వీఆర్ వంటి దిగ్గజాలు నటించినప్పటికీ కైకాల సత్యనారాయణ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.
వందలాది చిత్రాల్లో గొప్ప పాత్రలు పోషించిన నటుడు కైకాల సత్యనారాయణ గారు. పాత్ర ఏదైనా అందులో లీనమయ్యేవారు. అటువంటి గొప్ప నటుడిని కోల్పోవడం బాధాకరం. ఆయన అంత్యక్రియలకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
– మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
కైకాల సత్యనారాయణ గారి మరణం కలచివేసింది. భారతీయ సినీ పరిశ్రమలో ఆయన చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు మరొక నటుడు చేసి ఉండరు. కైకాల గారితో అనేక చిత్రాల్లో కలిసి నటించాను. ఆయన నన్ను తమ్ముడూ అని పిలిచేవారు. మా మధ్య ఎంతో అనుబంధం ఉండేది. నటన, రుచికరమైన భోజనం రెండూ ఆయనకు ప్రాణం. సత్యనారాయణ గారు గొప్ప సినీ సంపదను మనందరికీ అందించి వెళ్లిపోయారు.
– చిరంజీవి
కైకాల సత్యనారాయణ గారి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. కైకాల గారితో కలిసి పనిచేసిన అనుభవాలు మర్చిపోలేను. ఆయన లేని లోటు పూడ్చలేనిది. కైకాల గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
– మహేష్ బాబు
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణ వార్త కలచి వేసింది. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి
– రామ్చరణ్
కైకాల సత్యనారాయణ గారు పౌరాణిక, సాంఘిక, చారిత్రక చిత్రాల్లో ప్రేక్షకుల్ని మెప్పించారు. తన వైవిధ్యమైన నటనతో నవరస నటనా సార్వభౌముడిగా పేరు తెచ్చుకున్నారు. మంచి నటుడిగానే కాకుండా పార్లమెంట్ సభ్యుడిగా ప్రజాసేవ చేశారు. అలాంటి బాధ్యతగల నటుడు మన మధ్య లేకపోవడం బాధాకరం.
– బాలకృష్ణ