Human Rights Commision | బిగ్ బాస్ షోకు సంబంధించి రోజు రోజుకు వివాదం ముదురుతుంది. ఈ షో సీజన్ 7 ముగిసిన అనంతరం జరిగిన దాడి ఘటనపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు రెండు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఇదిలావుంటే.. తాజాగా బిగ్ బాస్ షో గురించి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (HRC)కు హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియో ఎదుట జరిగిన దాడిని న్యాయవాది తన ఫిర్యాదులో ప్రస్తావిస్తూ.. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని.. బిగ్ బాస్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారని.. ఇందులో నాగార్జున పేరు ఎక్కడ లేదని.. నాగార్జునను కూడా బాధ్యుడ్ని చేయాలని న్యాయవాది అరుణ్ విజ్ఞప్తి చేశారు. ఈ దాడి వలన 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయని.. నాగార్జునపైనా కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.
మరోవైపు.. ఈ దాడి ఘటనలో బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసును సుమోటోగా తీసుకున్న పోలీసులు విచారణ జరిపిన అనంతరం ఈ దాడులకు ముఖ్య కారణం పల్లవి ప్రశాంత్ అని తేల్చారు. దీంతో ఈ కేసులో పల్లవి ప్రశాంత్ను ప్రధాన నిందితుడిగా(ఎ-1) కేసు నమోదు చేశారు. అలాగే అతని సోదరుడు, స్నేహితుడిని సైతం నిందితులుగా(ఎ-2, ఎ-3) నమోదు చేసి మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే వీరికి సంబంధించిన రెండు కార్లను సీజ్ చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు.