తెలంగాణ సినీ ఎగ్జిబిటర్ల సుదీర్ఘ కాల డిమాండ్కు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. అద్దె విధానానికి స్వస్తిపలికి పర్సంటేజీ విధానంలో సినిమాల్ని ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం దిశగా గురువారం కీలక పరిణామం చేటుచేసుకుంది.
అద్దె విధానాన్ని రద్దు చేస్తూ మల్టీప్లెక్స్ల తరహాలో ఇకపై పర్సంటేజీ ఆధారిత రెవెన్యూ విధానంలో సినిమాలను ప్రదర్శించాలని హైదరాబాద్ నగరంలోని 23 సింగిల్స్క్రీన్ల థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్ 3 నుంచి ఈ విధానం అమలులోకి రానుందని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. దీని ప్రకారం సినిమా ప్రదర్శితమైన తొలివారం 60శాతం, రెండోవారం 50శాతం, మూడోవారం నుంచి 40 శాతం ఎగ్జిబిటర్లకు సినిమా వసూళ్లలో వాటా దక్కనుంది.
23 మంది ఎగ్జిబిటర్లు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ను సంప్రదించి డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరిపారు. హైదరాబాద్లోని 23 ప్రీమియం సింగిల్ స్క్రీన్లలో ప్రేక్షకులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తున్నామని, థియేటర్ల నిర్వహణకు పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నామని ఎగ్జిబిటర్లు వివరించారు. ప్రస్తుతం ఉన్న అద్దె విధానంలో నిర్వహణ కష్టమవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో పర్సంటేజీ ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించాలన్న ఎగ్జిబిటర్ల అభ్యర్థనను డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించారు.
నగరంలోని 23 థియేటర్లే కాకుండా తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్లలో విడతల వారిగా పర్సంటేజీ విధానాన్ని అమలుపరుస్తామని ఎగ్జిబిటర్లు తెలిపారు. మార్చి 11న బెంగళూరులో జరిగిన దక్షిణ భారత ఎగ్జిబిటర్ల సమావేశంలో కూడా పర్సంటేజీ విధానంపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారని, తెలుగు రాష్ర్టాలు మినహా దేశంలోని అన్ని రాష్ర్టాల్లోని సింగిల్ స్క్రీన్లు పర్సంటేజీ విధానాన్ని అనుసరిస్తున్నాయని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తెలియజేసింది.