Telangana Exhibitors Association | తెలంగాణలో సినిమా ప్రదర్శన విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో విడుదలయ్యే ప్రతి సినిమాను పర్సంటేజ్ విధానంలోనే థియేటర్లలో ప్రదర్శిస్తామని సంఘం స్పష్టం చేసింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’కి కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది.
తాజాగా జరిగిన సమావేశంలో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, “పెద్ది సినిమాకు కూడా పర్సంటేజ్ విధానం అమలు కావాలి. ఎంత శాతం ఇవ్వాలన్నది నిర్ణయించాలి. పర్సంటేజ్ విధానంపై స్పష్టత వస్తేనే తెలంగాణలో సినిమా ప్రదర్శన జరుగుతుంది” అని పేర్కొన్నారు.
ఈ అంశంపై గతంలో కూడా పలుమార్లు చర్చలు జరిగినట్లు సంఘం తెలిపింది. ముఖ్యంగా ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల సమయంలో కూడా ఇదే డిమాండ్ను ముందుకు తెచ్చినట్లు వెల్లడించారు. అయితే అప్పట్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వెనక్కి తగ్గామని, తర్వాత కూడా పలు దఫాలుగా చర్చలు కొనసాగించినప్పటికీ నిర్మాతల నుంచి తుది నిర్ణయం రాలేదని వివరించారు.
‘పెద్ది’ సినిమాను ఈ వివాదం నుంచి మినహాయించాలని మొదట భావించినట్లు ఎగ్జిబిటర్లు తెలిపారు. అయితే ఆ సినిమా తర్వాత కూడా సమస్యల పరిష్కారంపై ఎలాంటి హామీ లేకపోవడంతో, చివరికి ఈ సినిమాను కూడా పర్సంటేజ్ విధానంలోనే ప్రదర్శించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
అదే సమయంలో టికెట్ ధరల పెంపుపై కూడా ఎగ్జిబిటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెంచకూడదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. టికెట్ ధరలు పెరిగితే ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యే ప్రమాదం ఉందని, దీని ప్రభావం మొత్తం పరిశ్రమపై పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇక తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్ రావు ఎన్నికయ్యారు. ఇటీవల పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
థియేటర్లలో అమలవుతున్న రెంట్ ట్రాక్ విధానంపై కూడా ఎగ్జిబిటర్లు స్పందించారు. తాము పూర్తిగా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని, థియేటర్ల గ్రేడింగ్ సౌండ్ సిస్టమ్, ఏసీలు వంటి సదుపాయాల ఆధారంగా కాకుండా, ఆయా థియేటర్ల కలెక్షన్ల ఆధారంగా ఉండాలని సూచించారు.
అయితే ‘పెద్ది’ సినిమాపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని కూడా స్పష్టం చేశారు. “పెద్ది లాంటి పెద్ద సినిమాలకు మేము సెల్యూట్ చేస్తాం. ఆ సినిమాతో మాకు ఎలాంటి వ్యక్తిగత సమస్య లేదు. ఇది పరిశ్రమలో ఉన్న విధానాలకు సంబంధించిన అంశం మాత్రమే” అని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పేర్కొంది.
ఈ పరిణామం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల విడుదలలపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.