సినిమా ఇండస్ట్రీలోని సమస్యల్ని ప్రస్తావిస్తూ చక్కటి సందేశంతో ‘కమిట్మెంట్’ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పింది తేజస్వి మడివాడ. ఆమె ఓ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా తేజస్వి మడివాడ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఈ సినిమాలో నాలుగు కథలుంటాయి. వాటిలో నా కథ ఒకటి. సినిమాల్ని ప్రాణంగా భావిస్తూ అవకాశాల కోసం ప్రయత్నించే అమ్మాయిగా కనిపిస్తాను. రియాలిటీకి దగ్గరగా ఉండే నా పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ప్రతి రంగంలో మంచిచెడూ ఉంటాయి. అలాగే ఇండస్ట్రీలోని మరో పార్శాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. బిగ్బాస్ షోలోకి వెళ్లడం నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. కారు, ఇల్లు కొనుక్కొని హ్యాపీగా ఉన్నా. తమిళంలో కొన్ని సినిమాలు చేశా. ఆ ఇండస్ట్రీ అంతగా నచ్చలేదు. ప్రస్తుతం హిందీలో కూడా అవకాశాలొస్తున్నాయి’ అని చెప్పింది.